కాంగ్రెస్ది విభజించి.. దోచేసే ధోరణి
ABN , First Publish Date - 2022-02-12T06:56:54+05:30 IST
‘‘అందరినీ విశ్వాసంలోకి తీసుకుని అందరి అభివృద్ధిని కాంక్షించడం బీజేపీ ఉద్దేశం. కానీ, కులం, మతం, ప్రాంతం, భాషలవారీగా అందరినీ విభజించి..
- బీజేపీ ప్రజలందరి శ్రేయస్సును కోరుకుంటుంది.. ఉత్తరాఖండ్లో మోదీ
అల్మోరా, ఫిబ్రవరి 11: ‘‘అందరినీ విశ్వాసంలోకి తీసుకుని అందరి అభివృద్ధిని కాంక్షించడం బీజేపీ ఉద్దేశం. కానీ, కులం, మతం, ప్రాంతం, భాషలవారీగా అందరినీ విభజించి.. కలిసి దోచుకోవడం కాంగ్రెస్ నైజం’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. శుక్రవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఈ నెల 14న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ ఆ రాష్ట్రంలోని అల్మోరాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో మంచి ఉద్దేశాలున్న తమ పార్టీనే ప్రజలు ఆదరిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘పర్యాటక ఉత్తరాఖండ్ కావాలో..? వలసల ఉత్తరాఖండ్ కావాలో మీరే నిర్ణయించుకోండి’’ అని ప్రజలకు సూచించారు.
ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ను నిషేధించాలి
ఒకసారి మాత్రమే వినియోగించి పారేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించే యోచనకు భారత్ కట్టుబడి ఉందని మోదీ తాజాగా వెల్లడించారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అవగాహన తెచ్చేందుకు ఫ్రాన్స్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఫ్రాన్స్ తాజాగా ప్రారంభించిన ‘వన్ ఓషన్’(ఒకే మహాసముద్రం) శిఖరాగ్ర సమావేశానికి పంపించిన వీడియో సందేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.