మోదీ చెప్తున్నదంతా అరకొర సమాచారం : కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-10-22T21:46:51+05:30 IST

కోవిడ్ వ్యాక్సిన్ 100 కోట్ల డోసుల పంపిణీపై ప్రధాన

మోదీ చెప్తున్నదంతా అరకొర సమాచారం : కాంగ్రెస్

న్యూఢిల్లీ : కోవిడ్ వ్యాక్సిన్ 100 కోట్ల డోసుల పంపిణీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరకొర సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు చేసిన కృషిని తక్కువ చేసి చూపుతున్నారని విమర్శించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. 


కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరైనది కానటువంటి, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారన్నారు. మన దేశ సైంటిఫిక్ కమ్యూనిటీ, పరిశోధకులు చేసిన కఠోర శ్రమను మోదీ గుర్తించడం లేదన్నారు. భారత దేశం వ్యాక్సిన్‌ను తయారు చేయడం ఇదే తొలిసారి అని మోదీ అంటున్నారని, ఆయన మన పరిశోధకులు, శాస్త్రవేత్తల కృషిని పట్టించుకోవడం లేదని అన్నారు. 1985లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ఆరు వ్యాధులకు టీకాకరణను ప్రారంభించారన్నారు. సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని కూడా రాజీవ్ గాంధీ ప్రారంభించారన్నారు. మోదీ మాదిరిగా ఆయన ఎటువంటి ఆర్భాటాలు చేయలేదన్నారు. 


తక్కువ జనాభాగల దేశాలతో భారత దేశాన్ని మోదీ పోల్చుతున్నారన్నారు. చైనా 216 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చిందని, జనాభాలో 80 శాతం మందికి రెండు డోసులను ఇచ్చిందని తెలిపారు. భారత దేశం కేవలం 21 శాతం జనాభాకే రెండు డోసుల వ్యాక్సిన్‌ను ఇచ్చిందన్నారు. 


కోవిడ్ మహమ్మారి రెండో ప్రభంజనం సమయంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు క్షమాపణలు చేప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత, దయనీయమైన పాలన కారణంగానే ఈ మరణాలు సంభవించాయని ఆరోపించారు. 


Updated Date - 2021-10-22T21:46:51+05:30 IST