మోదీ కూడా హిట్లర్ లాగే...: కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-06-21T00:01:55+05:30 IST
అగ్నిపథ్' నిరసనల నడుమ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ ప్రధాని నరేంద్ర మోదీపై..
న్యూఢిల్లీ: 'అగ్నిపథ్' (Aganipath) నిరసనల నడుమ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ (Subodh kant Sahay) ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్మనీ నియంతి అడాల్ఫ్ హిట్లర్ లాగా నరేంద్ర మోదీ ప్రవర్తిస్తున్నారని, హిట్లర్ మార్గాన్నే ఆయన ఎంచుకుంటే ఆయనలాగే చస్తారని అన్నారు. జంతర్మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సత్యాగ్రహ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయనన ఈ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. ప్రధానమంత్రిపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలను పార్టీ అనుమతించదని తెలిపింది.
సత్యాగ్రహలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సుబోధ్ కాంత్ సహాయ్ మాట్లాడుతూ, ఇది దోపిడీదారుల ప్రభుత్వమని అన్నారు. మోదీ ఒక రింగ్మాస్టర్లా వ్యవహరిస్తున్నారని, నియంత పాత్రను పోషిస్తున్నారని విమర్శించారు. ''హిట్లర్ను కూడా మోదీ మించిపోయారని నేను భావిస్తున్నాను. హిట్లర్ కూడా ఆర్మీలో 'ఖాకి' అనే ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. హిట్లర్ మార్గానే మోదీ అనుసరిస్తే హిట్లర్ లాగానే ఆయన మరణిస్తారు, ఇది గుర్తుంచుకోవాలి'' అని అన్నారు.
జైరామ్ రమేష్ స్పందన...
కాగా, మోదీ ప్రభుత్వ నియంత్ర ధోరణి, ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేష్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ప్రధానికి వ్యతిరేకంగా చేసే అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ అంగీకరించదని చెప్పారు. గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగానే తమ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు.