మోగల్లుతో రాజానగరానికి ఎనలేని అనుబంధం
ABN , First Publish Date - 2022-07-03T06:29:06+05:30 IST
మోగల్లుతో రాజానగరానికి ఎనలేని అనుబంధం
ముదినేపల్లి, జూలై 2: విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా మోగల్లుకు మండలంలోని రాజానగరం గ్రామానికి విడదీయలేని బంధం ఉంది. 60 ఏళ్ల క్రితం మోగల్లు నుంచి వచ్చి రాజానగరంలో స్థిరపడిన పలు కుటుంబాలు నేటికీ అక్కడి వారితో మైత్రీ బంధం, సంబంధ బాంధవ్యాలు కొనసాగి స్తున్నాయి. అల్లూరి సీతారామరాజుతో ఆయన కుటుంబీకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న సాగి వంశీయులు ఎంతో మంది రాజానగరంలో ఉన్నారు. 1959లో మోగల్లు నుంచి సాగి సూరప రాజు తన కుటుంబంతో వచ్చి కొరగుంటపాలెంలో స్థిరపడి వ్యవసాయం చేసేవారు. అనంతరం ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు కలుగగా, వారికి కూడ మోగల్లులోని బంధువుల తోనే సంబంధాలు కలుపు కొన్నారు. కొంతకాలానికి కుమార్తెల కుటుంబాలు రాజానగరం వచ్చి స్థిర పడ్డాయి. అల్లూరి కంటే 12 ఏళ్ల చిన్న వాడైనప్పటికీ సూరప రాజు ఎక్కువగా సీతారామరాజుతోనే గడిపే వారట. సూరపరాజు తండ్రి నారాయణరాజుకు అల్లూరి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండేవట. కొంతకాలానికి భీమవరం, లక్కవరం నుంచి మరికొన్ని రాజుల కుటుంబాలు వచ్చి స్థిర పడటంతో ఈ గ్రామానికి రాజానగరం అని నామ కరణం చేశారు. అల్లూరితో ఉన్న అనుబంధానికి గుర్తుగా గ్రామంలో 20 ఏళ్ల క్రితమే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఆనందంగా ఉంది
అల్లూరి విగ్రహం భీమవరంలో ఏర్పాటు చేయటం, ఆవిష్కరణకు ప్రధాని రావడం ఆనం దంగా ఉంది. సోమవారం రాజానగరం వాసులంతా భీమవరం వెళ్లేందుకు ఉత్సాహంగా ఉన్నాం.
– సాగి సుబ్బరాజు, రాజానగరం