పునరుద్ధరణకు నోచని మహ్మద్ఖాన్ చెరువుకట్ట
ABN , First Publish Date - 2021-10-18T04:44:31+05:30 IST
మండలపరిధిలోని దేవునిపడకల్ మహ్మద్ఖాన్
- వృథాగా పోతున్న వర్షం నీరు
- ఆందోళనలో రైతాంగం
తలకొండపల్లి : మండలపరిధిలోని దేవునిపడకల్ మహ్మద్ఖాన్ చెరువుకట్ట పునరుద్ధరణ పనులు నేటికీ ప్రారంభించలేదు. దీంతో రైతులు, మత్య్సకారులు తీవ్రఆందోళన చెందుతున్నారు. గతనెల 30వ తేదిన కురిసిన భారీ వర్షాలకు మహ్మద్ఖాన్ చెరువు కట్ట తెగిపోయింది. నీరంతా వృథాగా పోయి ఆయకట్టు కింది పంటలు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెరువును సందర్శించిన ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ వారంరోజుల్లో తెగిపోయిన కట్టను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలుకు నోచుకోలేదు. జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, ఎంపీపీ నిర్మలశ్రీశైలంగౌడ్ కట్ట పునరుద్ధరణకు చెరువు వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించగా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతామని తెలిపినా ఆ దిశగా నేటికీ చర్యలు చేపట్టలేదు. కట్ట తెగిపోవడంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు. వారంరోజుల్లో పనులు ప్రారంభించి తెగిపోయిన కట్టను పునరుద్ధరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి రైతులు, నాయకులు, స్థానికులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.