తిరుపతి కోర్టుకు మోహన్బాబు
ABN , First Publish Date - 2022-06-29T09:01:26+05:30 IST
తిరుపతి కోర్టుకు మోహన్బాబు
ఆయన కుమారులు కూడా.. 2019 నాటి రాస్తారోకో కేసులో హాజరు
తిరుపతి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. 2019 మార్చి 22న చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలో ఈ ముగ్గురు, విద్యాసంస్థల ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీశ్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం రాస్తారోకో చేపట్టారు. దీంతో కళాశాల ఎదుట తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయని, ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎంపీడీవో హేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు దిగ్బంధం, వాహనాల రాకపోకలను అడ్డుకోవడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం తదితర అభియోగాలపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో విచారణకు మంగళవారం తిరుపతి 4వ ఏడీఎం కోర్టులో వీరంతా హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబరు 20వ తేదీకి వాయిదా వేసింది.