రైతుల ఖాతాలో సొమ్ము
ABN , First Publish Date - 2021-10-27T05:26:42+05:30 IST
డా.వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద 2021-22 ఏడాదికి రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవ సబ్సిడీని సీఎం జగన రైతుల ఖాతాల్లో జమ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మెగా చెక్కు అందజేసిన మంత్రి జయరాం
కర్నూలు(కలెక్టరేట్), అక్టోబరు 26: డా.వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద 2021-22 ఏడాదికి రైతులకు రెండో విడత పెట్టుబడి సాయం, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవ సబ్సిడీని సీఎం జగన రైతుల ఖాతాల్లో జమ చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కర్నూలు కలెక్టరేట్లో మంత్రి గుమ్మనూరు జయరాం, కలెక్టర్ పి.కోటేశ్వరరావు, పాణ్యం, బనగానపల్లె, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, జె.సుధాకర్, జడ్పీచైర్మన మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన వి.భరత కుమార్ రెడ్డి, కేడీసీసీ బ్యాంకు చైర్పర్సన ఎన.మహాలక్ష్మి, జాయింట్ కలెక్టర్లు రామసుందర్ రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, వ్యవసాయశాఖ జేడీ వరలక్ష్మి, రైతులు పాల్గొన్నారు. జిల్లాలో రైతుభరోసా పథకం రెండో విడత కింద 4,70,381 మంది రైతులకు రూ.98.14 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాలు (ఖరీఫ్-2020) సకాలంలో చెల్లించిన జిల్లాలోని 77,136 మంది రైతులకు వడ్డీ రాయితీ రూ.16.40 కోట్లు రైతుల ఖాతాలో జమ అయిందని కలెక్టర్ తెలిపారు. వైఎస్సార్ యంత్రసేవ పథకానికి సంబంధించి జిల్లాలో 197 రైతు బృందాల ఖాతాలకు రూ.2.52 కోట్లు జమ అయిందని తెలిపారు. వీటికి సంబంధించిన మెగా చెక్కులను మంత్రి గుమ్మనూరు జయరాం, కలెక్టర్, ఎమ్మెల్యేలు రైతులకు అందజేశారు.