దేశవ్యాప్తంగా బలహీనంగా నైరుతి రుతుపవనాలు..
ABN , First Publish Date - 2021-06-24T17:40:56+05:30 IST
మొదట్లో దేశంలో అనేక ప్రాంతాలకు వేగంగా విస్తరించిన నైరుతిరుతుపవనాలు...
అమరావతి: మొదట్లో దేశంలో అనేక ప్రాంతాలకు వేగంగా విస్తరించిన నైరుతిరుతుపవనాలు కొద్ది రోజులుగా మందగించాయి. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. విత్తనాలు నాటేంత వానలు పడడంలేదు. ఆకాశం మేఘావృతమవుతున్నా.. మేఘాలు చెల్లాచెదురై చెదురు ముదురు జల్లులు మాత్రమే పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మండలాల్లో ఖరీఫ్ సాగు పనులు మందకొడిగా సాగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.
రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మినహా చాలా చోట్ల వర్షాలు తగ్గాయి. రాజస్థాన్, ఢిల్లీ, హరియానా, పంజాబ్లో పలు ప్రాంతాలకు రుతుపవనాలు ఇంకా విస్తరించలేదని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మరో వారం తర్వాత కానీ రుతుపవనాలు పుంజుకునే అవకాశం లేదు. అప్పటి వరకు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే వాతావరణం ఉంది.