కొవిడ్-19 ఎఫెక్ట్: మరో చేదు వార్త వెల్లడించిన ఐరాస

ABN , First Publish Date - 2020-07-14T17:01:58+05:30 IST

కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మరింత మంది పస్తుల్లోకి జారుకునే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి చీఫ్..

కొవిడ్-19 ఎఫెక్ట్: మరో చేదు వార్త వెల్లడించిన ఐరాస

న్యూయార్క్: కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మరింత మంది పస్తుల్లోకి జారుకునే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. 'ఆహార భద్రత, పోషణ పరిస్థితి- 2020' నివేదికను ఆవిష్కరిస్తూ ఆయన ఈ మేరకు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశారు. 2019లో దాదాపు 69 కోట్ల మందికి పైగా ప్రజలు పస్తులతో గడిపారనీ... 2018తో పోల్చుకుంటే కోటి మందికి పైగా, గత ఐదేళ్లతో పోల్చుకుంటే 6 కోట్లకు పైగా ప్రజలు ఆకలితో గడిపినట్టు తాజా నివేదిక వెల్లడించింది. ‘‘ఈ ఏడాది ప్రపంచ ఆహార భద్రత, పోషణ పరిస్థితి నివేదిక మరో బాధాకరమైన సందేశాన్ని మోసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కేకలు పెరుగుతున్నాయి. కొవిడ్-19 కారణంగా ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఏడాది ఇంకా అనేకమంది పస్తుల్లోకి జారుకునే ప్రమాదం ఉంది..’’ అని ఐరాస చీఫ్ పేర్కొన్నారు.


ఇదే పరిస్థితి కొనసాగితే 2030 నాటికి ఆకలి లేని ప్రపంచంగా అవతరించాలన్న లక్ష్యం నెరవేరదని ఆయన గుర్తుచేశారు. ‘‘పరివర్తన ఇప్పుడే ఆరంభం కావాలి. మరింత స్థిరమైన, సంఘటిత ప్రపంచం దిశగా దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించాలంటే కొవిడ్-19 నిర్మూలన కోసం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం, ప్రపంచం కోసం ఆహార వ్యవస్థలను మరింత స్థిరంగా, స్థితిస్థాపకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది..’’ అని గుటెరస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆహార వ్యవస్థల సమ్మేళనం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-07-14T17:01:58+05:30 IST