ఉదయం రద్దీ.. మధ్యాహ్నం నుంచి నిర్మానుష్యం
ABN , First Publish Date - 2021-05-07T05:05:13+05:30 IST
గోపాలపట్నంలో కర్ఫ్యూ పకడ్బందీగా అమలు అవుతోంది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడంతో ఉదయం 6 గంటల నుంచే మార్కెట్లకు రద్దీ పెరిగింది.
కర్ఫ్యూ పకడ్బందీగా అమలు
ఉదయం వేళ దుకాణాలు, రైతుబజార్లకు పోటెత్తుతున్న జనం
కొన్ని చోట్ల భౌతిక దూరం పాటించని వైనం
మధ్యాహ్నం నుంచి రోడ్లన్నీ ఖాళీ
గోపాలపట్నం, మే 6: గోపాలపట్నంలో కర్ఫ్యూ పకడ్బందీగా అమలు అవుతోంది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడంతో ఉదయం 6 గంటల నుంచే మార్కెట్లకు రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్ ముగిసే సమయం వరకు ప్రధాన రహదారిలోని దుకాణ సముదాయాలు, మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నా మార్కెట్లలో మాత్రం రద్దీ తగ్గడం లేదు. ఈ నెలలో పెళ్లిళ్లు కూడా అధికంగా ఉండడంతో ముందుగా ముహూర్తాలు పెట్టుకున్నవారు పెళ్లి దుస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి వస్తుండడంతో షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి.
రైతుబజారులో రద్దీ
పెందుర్తి: కర్ఫ్యూ నేపథ్యంలో పెందుర్తి రైతుబజారు గురువారం ఉదయం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. జనం భౌతిక దూరం పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ కూరగాయలు కొనుగోలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే మధ్యాహ్నం 12 నుంచి ఆ ప్రాంతం నిర్మానుష్యంగా కనిపించింది. ప్రధాన రహదారులు కూడా బోసిపోయాయి.