2022: అర్ధ సంవత్సరంలో సంచలన విషయాలివే..
ABN , First Publish Date - 2022-07-02T13:29:35+05:30 IST
2022వ సంవత్సంలో సగం కాలం ముగిసింది.
2022వ సంవత్సంలో సగం కాలం ముగిసింది. ఈ సంవత్సరంలో ఇప్పటికే రాజకీయాల నుండి సాధారణ సమస్యల వరకు అనేక ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. పలువురు సెలబ్రిటీలు ఈ ఏడాది ప్రపంచానికి వీడ్కోలు పలికారు. కొన్ని సంఘటనలు ఎంతో సంతోషాన్ని కలిగించగా, మరికొన్ని సంఘటనలు హృదయ విదారకంగా మారాయి. ఏడాదిలో గడచిన 6 నెలల్లో తొక్కిసలాటలు, విధానాల మార్పు, సినిమాల వివాదం, రాజకీయాల్లో కుదుపుల లాంటి ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ 2022 అర్ధ సంవత్సరంలో దేశంలో చోటుచేసుకున్న ప్రముఖ ఘటనలను ఒకసారి నెమరువేసుకుందాం.
జనవరి 1: సంవత్సర ఆరంభం ఒక ఊహించని వార్తతో ప్రారంభమైంది. జనవరి 1వ తేదీన వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఊపిరాడక 12 మంది చనిపోయారు.
జనవరి 5: పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని ఒక ఫ్లైఓవర్ వద్ద రైతుల నిరసన జరిగింది. దానిలో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ చిక్కుకుపోయింది.
ఫిబ్రవరి 14: ఫిబ్రవరిలో కర్నాటకలో హిజాబ్ గురించి చాలా గొడవలు జరిగాయి. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు బురఖా లేదా హిజాబ్ ధరించకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత చాలా వివాదాలు జరిగాయి.
మార్చి 10: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో బీజేపీ విజయం సాధించింది. పంజాబ్లో ఆప్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
మార్చి 11: కాశ్మీర్ ఫైల్స్ చిత్రం విడుదలైంది. దేశవ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది.
మే 19: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిఖత్ జరీన్ 52 కిలోల విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ రికార్డు సాధించిన ఐదో భారతీయ మహిళగా జరీన్ నిలిచింది.
మే 29: పంజాబీ గాయకుడు సిద్ధు ముసేవాలా హత్యకు గురయ్యారు.
జూన్ 16: భారత ప్రభుత్వం ప్రారంభించిన అగ్నిపథ్ పథకంపై వ్యతిరేకత పెల్లుబుకింది. రైల్వే నెట్వర్క్కు నష్టం వాటిల్లింది.
జూన్ 30: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు సంభవించాయి. ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయగా, ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
బిర్జూ మహారాజ్ జనవరి 17న, లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న, బప్పి లాహిరి ఫిబ్రవరి 15న, రాహుల్ బజాజ్ ఫిబ్రవరి 12న కన్నుమూశారు.