HYD : నంబర్ ప్లేట్లేని స్కూటీపై తిరుగుతూ అర్ధరాత్రి తర్వాత ఖరీదైన విల్లాల్లో చోరీలు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..
ABN , First Publish Date - 2021-11-28T16:28:23+05:30 IST
HYD : నంబర్ ప్లేట్లేని స్కూటీపై తిరుగుతూ అర్ధరాత్రి తర్వాత ఖరీదైన విల్లాల్లో చోరీలు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..
- ఘరానా దొంగ అరెస్ట్
- ఖరీదైన విల్లాలే టార్గెట్
- నాలుగేళ్లలో 27 చోరీలు
- 180 తులాల బంగారం సహా 93.62లక్షల సొత్తు స్వాధీనం
హైదరాబాద్ సిటీ/నేరేడ్మెట్ : నంబర్ ప్లేట్లేని స్కూటీపై కాలనీల్లో తిరుగుతూ అర్ధరాత్రి తర్వాత చోరీకి తెగబడతాడు. డబ్బు, బంగారం, వెండి ఇలా దొరికిన విలువైన వస్తువులను దోచేస్తాడు. ఆ డబ్బుతో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లు ఆడతాడు. ఇలా 2018నుంచి వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ ఆటకట్టించారు రాచకొండ సీసీఎస్ పోలీసులు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేరేడ్మెట్లోని కమిషనరేట్లో శనివారం వివరాలు వెల్లడించారు.
చార్మినార్ యాకత్పురాకు చెందిన గఫార్ఖాన్ అలియాస్ జిగర్ పూల వ్యాపారం చేసేవాడు. జల్సాలు, లగ్జరీ జీవితానికి అలవాటుపడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. హీరో డియో వాహనంపై ట్రై కమిషనరేట్ పరిధిలోని కాలనీల్లో రెక్కీ చేసేవాడు. డూప్లెక్స్, ఖరీదైన విల్లాలలో అర్ధరాత్రి తర్వాత చోరీలకు పాల్పడేవాడు. 2018నుంచి ఇప్పటి వరకు 27 చోరీలు చేశాడు. 2018లో మలక్పేట పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. అప్పట్లో అతనిపై హైదరాబాద్ సీపీ పీడీయాక్ట్ను కూడా నమోదు చేశారు. 2019 జూలైలో జైలు నుంచి బయటకొచ్చిన నిందితుడు మళ్లీ చోరీలకు పాల్పడ్డాడు.
మాటు వేసిన సీసీఎస్ పోలీసులు
ఈ నెల19న అర్ధరాత్రి దాటిన తర్వాత సరూర్నగర్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 70తులాల బంగారం చోరీకి గురైంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, క్లూస్టీమ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ సిబ్బందితో చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీఎస్, సరూర్నగర్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్లను రంగంలోకి దింపారు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా చోరీ చేసింది పాత నేరస్థుడు గఫార్ఖాన్గా ఆధారాలు గుర్తించారు. సీసీఎస్ పోలీసులు మాటువేసి నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. అతనితోపాటు దోచేసిన సొత్తును కొనుగోలు చేస్తున్న రిసీవర్ సయ్యద్ ఖాజా పాషాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి రూ.1.90లక్షల నగదు, 180.5 తులాల బంగారం, డియో బైక్, 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.93.62లక్షలుంటుంది. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని సీపీ అభినందించి రివార్డులు అందజేశారు.