తల్లీ... చెల్లి హత్య కేసులో బాలుడు అరెస్టు
ABN , First Publish Date - 2021-10-25T05:13:08+05:30 IST
తల్లి, చెల్లిని హత్య చేసిన కేసులో నిందితుడిగా 18 ఏళ్ల బా లుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటశివారెడ్డి ప్రకటించారు.
వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటశివారెడ్డి
కడప(క్రైం), అక్టోబరు 24: తల్లి, చెల్లిని హత్య చేసిన కేసులో నిందితుడిగా 18 ఏళ్ల బా లుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటశివారెడ్డి ప్రకటించారు. కడప డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 19 ఏళ్ల కిందట కువైత్లో వివాహం చేసుకున్న మహమ్మద్ హుసేన్, షేక్ కుర్షిదాబేగంకు కొడుకు, కుమార్తె పిల్లలున్నారు. కాగా కుర్షిదా బేగం భర్త నుంచి విడిగా కుమార్తె, కొడుకుతో కలిసి కడప నఖా్షలో నివసిస్తోంది.
కొడుకు డిగ్రీ చదువుతుండగా, కుమార్తె 9వ తరగతి చదువుతోంది. సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతోందని కుమార్తెను, చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో ఉన్న నగదును తీసుకెళ్లి ఖర్చు చేస్తుండడంతో కుమారు డిని తల్లి తరచూ మందలించేది. ఈమేరకు ఈ నెల 21న కుమార్తెను మందలించగా అదేసమయంలో కొడుకును కూడా మందలించింది. అయితే చెల్లెలికే తల్లి ప్రాధాన్యత ఇస్తోందని మనసులో పెట్టుకున్న కుమారుడు సెల్ ఫోన్లో ఆడుకుంటున్న చెల్లెల్ని మందలించి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అది చూసి అడ్డువచ్చిన కన్నతల్లిని కత్తితో రెండు పోట్లు గొంతులో పొడవడంతో ఆమె కూడా అక్కడికక్కడే మృతిచెంది నట్లు తెలిపారు.
అంతేకాకుండా హత్య విషయాలు తెలియకుండా ఉండేందుకు ఇంట్లో ఉన్న సాక్ష్యాలను తారుమారు చేసి పరారయ్యాడని తెలిపారు. ఈ మేరకు అర్బన్ సీఐ అలీ, టూటౌన్ ఎస్ఐ తులసీ నాగప్రసాద్ నిందితుడైన 18 ఏళ్ల బాలుడిని అరెస్టు చేసి బాలల సంరక్షణాకేంద్రానికి తరలించినట్లు తెలిపారు.