ఈ రెండున్నరేళ్ల చిన్నారి నవ్వును చూస్తే చాలు.. ఎన్ని కష్టాలయినా మర్చిపోవచ్చు.. కానీ ఈ తల్లి ఇలా చేసిందేంటి..!
ABN , First Publish Date - 2021-12-20T17:55:02+05:30 IST
రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలోని ఒక వివాహిత..
రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలోని ఒక వివాహిత తన రెండున్నరేళ్ల కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుంది. దీనికి ముందు ఆమె ఒక ఆడియో రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఆత్మహత్యకు జైపూర్కు చెందిన ఒక మహిళా పట్వారీనే కారణమని ఆరోపించింది. తన ఆత్తామామల ప్రమేయం లేదని ఆడియోలో స్పష్టం చేసింది. వైరల్గా మారిన ఈ ఆడియో స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, ఆ మహిళా పట్వారీ గురించి ఆరా తీస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బల్వానా ప్రాంతానికి చెందిన ప్రకాశ్ దేవి తన రెండున్నరేళ్ల కుమార్తె ఆర్యతో సహా వాటర్ ట్యాంకులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త అశోక్ కుమార్.. సాంచౌర్లో పట్వారీగా పనిచేస్తున్నాడు. రండు రోజుల క్రితం కుటుంబ సభ్యులంతా బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. అక్కడ ఇంటిలో ఎవరూలేని సమయం చూసుకుని ప్రకాశ్ దేవి ఒక ఆడియోను రికార్టు చేసి, దానిని వాట్సాప్ గ్రూపులో షేర్ చేసింది. ఆ తరువాత కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుంది. 19 సెకెన్లున్న ఆ ఆడియో ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.