Kuwait లో 'అమ్మా'నుషం.. ఏ తల్లి తన బిడ్డను ఇలా చేసి ఉండదు..!

ABN , First Publish Date - 2022-07-12T18:11:25+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. పేగు తెంచుకుని పుట్టిన కొడుకును చంపేసిన తల్లి.. ఐదు రోజుల పాటు బిడ్డ శవాన్ని ఇంట్లోనే పెట్టుకుంది.

Kuwait లో 'అమ్మా'నుషం.. ఏ తల్లి తన బిడ్డను ఇలా చేసి ఉండదు..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. పేగు తెంచుకుని పుట్టిన కొడుకును చంపేసిన తల్లి.. ఐదు రోజుల పాటు బిడ్డ శవాన్ని ఇంట్లోనే పెట్టుకుంది. ఆపై ఏమి తెలియనట్టు తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే, ఆ బాలుడిని చంపింది కన్నతల్లి అని తెలిసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్ట్ అబ్దుల్లా అల్ ముబారక్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అప్పటి నుంచి పోలీసులు బాలుడి ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు. కానీ, ఎక్కడ అతడి జాడ దొరకలేదు. 


ఈ క్రమంలో తల్లి ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో తన కుమారుడిని తానే చంపినట్లు అంగీకరించింది. బాలుడిని చంపేసిన తర్వాత ఐదు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోని ఉంచి, ఆ తర్వాత ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెట్టినట్లు తెలిపింది. అనంతరం కుమారుడు కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్పింది. దాంతో ఆమె చెప్పిన చోట వెళ్లి తవ్వి చూడగా బాలుడి మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. అయితే, ఆమె ఎందుకు కన్నకొడుకును చంపింది అనే విషయాన్ని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా అందిరినీ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది.     


Updated Date - 2022-07-12T18:11:25+05:30 IST