బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-29T08:30:30+05:30 IST

ఇష్టం లేని కాపురానికి వెళ్లలేనంటూ... కన్న బిడ్డను కడతేర్చి ఆపై తల్లి కూడా తనువు చాలించిన ఘటన శ్రీకాళహస్తిలో శనివారం చోటుచేసుకుంది

బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య
మనవడి మృతదేహం వద్ద విలపిస్తున్న విజయలక్ష్మి

ఇష్టం లేని కాపురానికి వెళ్లలేక అఘాయిత్యం

శ్రీకాళహస్తి , మే 28 : ఇష్టం లేని కాపురానికి వెళ్లలేనంటూ... కన్న బిడ్డను కడతేర్చి ఆపై తల్లి కూడా తనువు చాలించిన ఘటన శ్రీకాళహస్తిలో శనివారం చోటుచేసుకుంది.ఎ్‌సఐ మహేష్‌ కథనం మేరకు... శ్రీకాళహస్తి పట్టణ శివార్లలోని ఈదులగుంటకు చెందిన కల్యాణికి నాలుగేళ్ల క్రితం చెన్నై నగరానికి చెందిన మునిశేఖర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుతో వివాహం చేశారు. పెళ్లి జరిగిన యేడాదికి ముని మేధాన్ష్‌(3) అలియాస్‌ బబ్లూ అనే బిడ్డ పుట్టాడు. అప్పటికే దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. బిడ్డ పుట్టిన తరువాత కుటుంబ కలహాలు ముదిరి గొడవలకు దారి తీసాయి.దీంతో రెండేళ్లనుంచి కల్యాణి శ్రీకాళహస్తిలో అమ్మ విజయలక్ష్మి ఇంటిలోనే ఉంటోంది.విడాకులకు కూడా దరఖాస్తు చేసుకుంది. వారం రోజుల క్రితం అమెరికా నుంచి కల్యాణి అన్న మోహన్‌ శ్రీకాళహస్తికి వచ్చాడు.భర్తతో కాపురానికి వెళ్లాలని చెల్లెలికి సలహా ఇచ్చాడు. అనంతరం తిరిగి అమెరికాకు వెళ్లిపోయాడు. కాపురానికి వెళ్లమని బంధువులు కూడా కోరుతుండడంతో ఇష్టంలేని కల్యాణి ముభావంగా ఉంటోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆమె బిడ్డతో పాటు పడక గదిలోకి వెళ్లింది. ముందుగా బిడ్డకు విషం ఇచ్చి చనిపోయాడని నిర్ధారించుకొన్న తరువాత ఆమె కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది.తల్లి విజయలక్ష్మికి అనుమానం వచ్చి తలుపు కొట్టగా తీయలేదు. ఇరుగు పొరుగు వారి సహాయంతో గది తెరచి చూడగా అప్పటికే మృతి చెందిన బిడ్డ, కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న కల్యాణి కనిపించారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే కల్యాణి మృతి చెందినట్టు నిర్ధారించడంతో ఆరుగంటలకు బంధువులు కల్యాణి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.ఈ సమాచారమందు కున్న టూ టౌన్‌ సీఐ భాస్కర నాయక్‌, ఎస్‌ఐ మహేష్‌ సిబ్బందితో కల్యాణి ఇంటివద్దకు వెళ్లారు.కేసు నమోదుకు కల్యాణి బంధువులు నిరాకరించడంతో మూడు గంటలకు పైగా వారికి పోలీసులు నచ్చజెప్పాల్సి వచ్చింది.చివరకు రాత్రి 10గంటలకు కల్యాణి,ఆమె కుమారుడి మృతదేహా లను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు.  

Updated Date - 2022-05-29T08:30:30+05:30 IST