ఈ ఆరేళ్ల చిన్నారిని కన్నతల్లే పొట్టనబెట్టుకుంది.. ఆపై అనారోగ్యంతో మృతి అంటూ నాటకం.. చివరకు కథ అడ్డం తిరిగిందిలా..!
ABN , First Publish Date - 2021-12-11T22:32:22+05:30 IST
కన్నకూతురు అనే మమకారం లేకుండా ఆ తల్లి కసాయిలా ప్రవర్తించింది. తన ద్వితీయ వివాహానికి అడ్డు వస్తోందని అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనబెట్టుకుంది
కన్నకూతురు అనే మమకారం లేకుండా ఆ తల్లి కసాయిలా ప్రవర్తించింది. తన ద్వితీయ వివాహానికి అడ్డు వస్తోందని అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనబెట్టుకుంది. అనారోగ్యంతో మృతి చెందింది అంటూ నాటకమాడింది. మృతదేహాన్ని పూడ్చి పెట్టేసింది. అనంతరం తన కూతురు కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించి మొత్తం కథ అంతా బయటపెట్టారు. పంజాబ్లోని అమృత్సర్లో ఈ ఘటన జరిగింది.
అమృత్సర్కు సమీపంలోని సాహిబ్ గురుద్వారా గ్రామానికి చెందిన సందీప్ కౌర్ అనే మహిళ నవంబర్ 30న స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి తన ఆరేళ్ల కూతురు పర్వీన్ కౌర్ కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు రోజుల తర్వాత ఆ గ్రామ శివార్లలో ఇసుకలో కప్పేసి ఉన్న పర్వీన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టమ్కు తరలించారు. ఆ బాలికపై అత్యాచారం జరగలేదని, ఆమెను ఎవరో గొంతు నులిమి చంపేశారని పోస్ట్మార్టమ్ ద్వారా తేలింది. విచారణ ప్రారంభించిన పోలీసులు.. సందీప్ కౌర్కు లవ్ప్రీత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉన్నట్టు కనుగొన్నారు.
లవ్ప్రీత్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు అసలు విషయాన్ని బయటపెట్టారు. నవంబర్ 30వ తేదీ రాత్రి పర్వీన్ను ఆమె తల్లి సందీప్, తాను, తన సోదరి కలిసి చంపేశామని లవ్ప్రీత్ అంగీకరించాడు. మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి బయటకు తీసుకెళ్తున్నప్పుడు పక్కింటి బల్వీందర్ చూశాడని, పర్వీన్కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్టు అతనికి చెప్పామని తెలిపాడు. అనంతరం ఆ మృతదేహాన్ని ఊరి చివర ఇసుకలో పూడ్చామని చెప్పాడు. దీంతో పోలీసులు సందీప్ కౌర్, లవ్ప్రీత్, అతని సోదరిని అరెస్ట్ చేశారు.