డివైడర్‌ను ఢీకొట్టి మోటారు సైక్లిస్ట్‌ మృతి

ABN , First Publish Date - 2021-07-28T05:47:18+05:30 IST

జాతీయ రహదారిపై నాతయ్యపాలెం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

డివైడర్‌ను ఢీకొట్టి మోటారు సైక్లిస్ట్‌ మృతి
ప్రమాద స్థలిలో మృతుడు చైతన్య

వెనుక కూర్చున్న వ్యక్తికి ఫిట్స్‌ రావడంతో అదుపు తప్పిన వాహనం

అక్కిరెడ్డిపాలెం. జూలై 27: జాతీయ రహదారిపై నాతయ్యపాలెం వద్ద  మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెనుక కూర్చున్న బంధువుకు ఫిట్స్‌ రావడంతో వాహనం నడుపుతున్న వ్యక్తి ఆందోళన చెంది, డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. వివరాలిలా ఉన్నాయి.. గాజువాక దరి శ్రీనగర్‌కు చెందిన డాక్‌యార్డు ఉద్యోగి బి.రామకృష్ణ కుమారుడు  చైతన్య(24) బీటెక్‌ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. మంగళవారం తన బంధువు వినోద్‌ను చినముషిడివాడలో పరీక్ష రాసేందుకు తీసుకువెళ్లాడు. తిరిగి సాయింత్రం ఇంటికి వస్తుండగా, నాతయ్యపాలెం  వద్దకు వచ్చేసరికి వాహనం వెనుక కూర్చున్న వినోద్‌కు ఒక్కసారిగా ఫిట్స్‌ వచ్చింది.  దీంతో ఆందోళన చెందిన చైతన్య వాహనాన్ని ఆపే క్రమంలో  అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.  చైతన్య తలకు, ఛాతికి తీవ్ర గాయాలు కాగా వినోద్‌ కాళ్లపై, ఛాతిపై గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇరువురిని స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆసుపత్రికి తరలించగా,  చైతన్య అప్పటికే మృతి చెందినట్టు  వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, గాజువాక పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-07-28T05:47:18+05:30 IST