సినీ నటుడు సాయికిరణ్‌కు పది లక్షల టోకరా

ABN , First Publish Date - 2022-06-26T17:05:47+05:30 IST

మన మినిస్ట్రీస్‌ అనే పథకంలో డబ్బులు పెట్టడం వల్ల రెట్టింపు లాభం రావడంతోపాటు సినిమా అవకాశాలు మెరుగుపడతాయని

సినీ నటుడు సాయికిరణ్‌కు పది లక్షల టోకరా

హైదరాబాద్/బంజారాహిల్స్‌: మన మినిస్ట్రీస్‌ అనే పథకంలో డబ్బులు పెట్టడం వల్ల రెట్టింపు లాభం రావడంతోపాటు సినిమా అవకాశాలు మెరుగుపడతాయని మాయమాటలు చెప్పి రూ.10.64 లక్షల మోసం చేసిన ఇద్దరిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 8లో నివాసముండే వి.సాయికిరణ్‌ సినీ, బుల్లితెర నటుడు. అతడికి గతేడాది జాన్‌ బాబు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. మన మినిస్ట్రీ్‌సలో పెట్టుబడి పెట్టాలని సూచించారు. కొద్ది కాలానికి రూ.35లక్షలు వస్తాయని, సినిమా అవకాశాలు పెరుగుతాయని చెప్పాడు. పెట్టుబడి పెట్టేందుకు సాయికిరణ్‌ ఒప్పుకున్నాడు. నవంబర్‌ 2021లో లివింగ్‌ స్టోన్‌ అనే వ్యక్తి సమక్షంలో మన మినిస్ట్రీస్‌ ఖాతాకు కొంత డబ్బు బదిలీ చేశాడు. ఆ తరువాత జాన్‌బాబు ఖాతాకు జీపే, ఫోన్‌ పే ద్వారా మరికొంత డబ్బు పంపించాడు.


ఇలా మొత్తం రూ.10.65 లక్షలు చెల్లించాడు. రోజులు గడుస్తున్నా ఇద్దరి నుంచి ఎటువంటి స్పందన లేదు. వాకబు చేయగా నైజీరియన్‌ల తరహా డబ్బు తీసుకొని మోసం చేస్తున్నట్టు గ్రహించాడు. ఈ యేడాది మార్చిలో జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జాన్‌బాబు రూ.10లక్షలకు సంబంధించి రెండు చెక్కులను ఇచ్చాడు. బ్యాంక్‌లో చెల్లుబాటు కాలేదు. దీంతో సాయికిరణ్‌ మరోసారి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జాన్‌బాబు, లివింగ్‌స్టోన్‌లపై ఐపీసీ 420, 406 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-06-26T17:05:47+05:30 IST