‘వైసీపీ నేతల భూమాయ’పై కదిలిన యంత్రాగం
ABN , First Publish Date - 2021-07-24T06:11:14+05:30 IST
‘వైసీపీ నేతల భూమాయ’ అధికారులను పరుగులు పెట్టించింది.
అచ్యుతాపురం, జూలై 23 : ‘వైసీపీ నేతల భూమాయ’ అధికారులను పరుగులు పెట్టించింది. మండలంలోని కొండకర్ల అందలాపల్లి పంచాయతీ పరిధిలో వైసీపీ నాయకులు రైతుల నుంచి 5.76 ఎకరాల జిరాయితీ భూమిని కొనుగోలు చేసి, దాని పక్కనున్న 1.24 ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపి రియల్టర్కు విక్రయించినట్టు శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు వెనువెంటనే స్పందించారు. రియల్టర్ లేఅవుట్ అప్రూవల్కు విశాఖ వెళ్లడంతో ప్రభుత్వ భూమి ఉందన్న విషయం తెలిసింది. దీనిపై కథనం ప్రచురితం కావడంతో ఆర్ఐ సోమేష్ కుమార్, వీఆర్వో ఆర్సీహెచ్ఎస్ నాయుడు, అనకాపల్లి నుంచి వచ్చిన డివిజనల్ సర్వేయర్ బాబూరావుతో కలిసి శుక్రవారం సర్వే జరిపారు. సర్వే నంబరు 120లో గల 1.24 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. అప్పటికే ప్రభుత్వ భూమిని చదును చేసేశారు. అందులో బోర్డు పాతడంతో పాటు లే అవుట్లో గుర్తించిన ప్రభుత్వ స్థలంలో రాళ్లు పాతారు.