పొంచి ఉన్న ఒమైక్రాన్ ముప్పు
ABN , First Publish Date - 2021-12-03T05:46:29+05:30 IST
ఒమైక్రాన్ వేరియంట్ ముప్పు దేశానికి పొంచి ఉందని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు.
గుంటూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఒమైక్రాన్ వేరియంట్ ముప్పు దేశానికి పొంచి ఉందని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. గురువారం ఆయన పార్లమెంట్లో ప్రసంగిస్తూ రెండేళ్ల క్రితం వచ్చిన కరోనా వైరస్తో ఆరోగ్య మౌలిక సదుపాయాలలో దేశ బలహీనత బహిర్గతమైందన్నారు. పడకులు, వెంటీలేటర్ల కొరత, పీపీకిట్లు, ఆక్సిజన్ కొరతతో అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. ఈ పరిస్థితుల్లో ఒమైక్రాన్పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు ఖచ్చితంగా ప్రభుత్వాలా ద్వారా చేరాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యసదుపాయాలు సరిపోవని సభ దృష్టికి తెచ్చారు. వైరస్ ప్రభావంతో మానవతా సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్తో పాటు, కొత్త వేరియంట్ను కూడా దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రణాళిక చేస్తుందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. పూర్తిగా టీకాలు వేసిన వారికి బూస్టర్ మోతాదులు వేసే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. అలానే 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా టీకా వేయాలని కేంద్రాన్ని జయదేవ్ కోరారు.