అంతిమ విజయం ఉద్యోగులదే!
ABN , First Publish Date - 2022-01-24T08:53:08+05:30 IST
రాష్ట్రంలో ఉద్యోగులకు ఇచ్చే జీతాలను సంక్షేమ పథకాలకు సర్దుకోవచ్చన్న ఆలోచన చేస్తున్నారని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు.
2 నెలలు జీతాలివ్వకుంటే ఆర్థిక ఎమర్జెన్సీ
గుడివాడ కేసినో సూత్రధారులెవరు?
అనర్హతపై చేతులెత్తేస్తే రాజీనామా చేస్తా
చిరంజీవికి పేర్ని క్షమాపణ చెప్పాలి: రఘురామ
న్యూఢిల్లీ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగులకు ఇచ్చే జీతాలను సంక్షేమ పథకాలకు సర్దుకోవచ్చన్న ఆలోచన చేస్తున్నారని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. రెండు నెలలపాటు జీతాలు ఇవ్వకపోతే ఆర్థిక ఎమరెన్సీ వస్తుందని హెచ్చరించారు. ఢిల్లీలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ తమ సమస్యలపై పోరాడుతున్న ఉద్యోగులదే అంతిమ విజయమన్నారు. పరిమితికి మించి అప్పులు తెచ్చి, రాష్ర్టాన్ని ఆర్థికంగా దివాళా తీస్తున్నారని విమర్శించారు. తనపై అనర్హతవేటు వే యించలేమని వైసీపీ అధిష్ఠానం ఒప్పుకొంటే, ఆ మరుక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అనర్హతవేటుకు ఫిబ్రవరి 5వ తేదీ వరకు గడువిస్తున్నానని చెప్పారు.
తాను ఢిల్లీలో ఉంటే, పారిపోయినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడలో జరిగిన కేసినో వెనుక అసలు సూత్రధారులెవరో? అక్కడ ఆర్జించిన వందల కోట్లు ఎవరికి చే రాయో? నిజానిజాలు తేలాలన్నారు. మంత్రి కొడాలి నానికి ఇందులో సంబంధం ఉందని తాను భావించడంలేదని, నానిని కొందరు ఇరికిస్తున్నారేమోనని సందేహం కలుగుతోందని చెప్పారు. సినిమా టికెట్లపై సీఎంతో చర్చించేందుకు వెళ్లిన చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నాని తక్షణమే ఆయనకు క్షమాపణలు చెప్పాలని రఘురామ డిమాండ్ చేశారు.