యువ హీరో సాయి తేజ్ ప్రమాదంపై ఎంపీ విజయసాయి ట్వీట్..
ABN , First Publish Date - 2021-09-11T20:15:17+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే...
అమరావతి/హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై పలువురు రాజకీయ నేతలు, టాలీవుడ్ పెద్దలు, సీనియర్, జూనియర్ హీరోలు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు పెద్దలు నేరుగా అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
సాయి కోలుకుంటున్నారు..!
‘ప్రమాదానికి గురైన యువ హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అపోలో ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. సాయి తేజ్ హెల్మెట్ ధరించడం సంతోషకరం. యువత బైక్పై వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని విజయసాయి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై నెటిజన్లు, సొంత పార్టీ కార్యకర్తలు రకరకాలుగా రిప్లయ్లు ఇవ్వడం.. ఇంకొందరు పరోక్షంగా ఆయనపైనే కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు.. సాయి ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో స్పందించారు.