వచ్చామా.. పోయామా అంటే కుదరదు
ABN , First Publish Date - 2022-08-09T03:42:19+05:30 IST
సచివాలయ ఉద్యోగులు వచ్చామా.. పోయామా... అంటే కుదరదని, ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాలను పూర్తి చేయడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎంపీడీవో ఐజాక్ప్రవీణ్ సూచించారు.
సచివాలయ సిబ్బందిపై ఎంపీడీవో ఆగ్రహం
ఇద్దరికి మెమోలు
ఉదయగిరి రూరల్, ఆగస్టు 8: సచివాలయ ఉద్యోగులు వచ్చామా.. పోయామా... అంటే కుదరదని, ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాలను పూర్తి చేయడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎంపీడీవో ఐజాక్ప్రవీణ్ సూచించారు. సోమవారం మండలంలోని కొండాయపాళెం సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి పలువురు ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంపై మండిపడ్డాడరు. క్షేత్రస్థాయికి వెళ్లిన వారికి ఫోన్ చేసి విచారించడంతోపాటు విధులకు హాజరు కాని వీహెచ్ఏ, లైన్మెన్లకు మెమోలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. ప్రతిరోజు బయోమెట్రిక్ హాజరు వేయడంతోపాటు అటెండెన్స్ రిజస్టర్లో సంతకం చేయాలన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లే వారు మూమెంట్ రిజిస్టర్లో తప్పనిసరిగా రాయాలన్నారు. ప్రజల వినతులను రికార్డుల్లో నమోదు చేసి పరిష్కరానికి చర్యలు చేపట్టాలన్నారు. వలంటీర్లు బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగూర్బీ, మండల కోఆర్డినేటర్ షేక్ గాజుల ఇమ్రాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.