ప్రజారోగ్య భద్రతే ఎంఆర్హెచ్ఆర్యూ లక్ష్యం
ABN , First Publish Date - 2022-06-28T07:28:49+05:30 IST
ప్రజారోగ్య భద్రతే ఎంఆర్హెచ్ఆర్యూ లక్ష్యమని ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ వెల్లడించారు.
ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ వెల్లడి
తిరుపతి సిటీ, జూన్ 27: ప్రజారోగ్య భద్రతే మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ (ఎంఆర్హెచ్ఆర్యూ) లక్ష్యమని ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ వెల్లడించారు. ప్రజారోగ్య భద్రతకు అవసరమైన పరిశోధనలపై కళాశాలలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. వైద్య కళాశాలకు అనుసంధానంగా చంద్రగిరిలో ఎంఆర్హెచ్ఆర్యూను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. దీనికి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న పరిశోధన కేంద్రంగా గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ ప్రజారోగ్య భద్రతకు సంబంధించి 38 రకాల పరిశోధనలు విస్తృతంగా చేపట్టామన్నారు. ఈ కేంద్రంలో తమతోపాటు ఇతర యూనివర్సిటీలకు వైద్యులు, విద్యార్థులు, అధ్యాపకులతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ పరిశోధనలు చేసే అవకాశం ఉందని చెప్పారు. దీనికి కేంద్రం నుంచి తగిన ప్రోత్సాహం కూడా లభిస్తుందని తెలిపారు. కేంద్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ జి.రవి ప్రభు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సాధారణ, దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి రక్షించడానికి ఈ రీసెర్చ్ కేంద్రం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. టెలీమెడిసిన్ ద్వారా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడానికి రీసెర్చు ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. రుయాస్పత్రిలోని ఎంఆర్యూ కేంద్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరీటి మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో తాము 2020 నుంచి 2022 వరకు 6,82,809 మందికి కొవిడ్ పరీక్షలు చేశామని 63,605 మంది బాధితులుగా గుర్తించామన్నారు. నవజాత శిశువుల పేగు నుంచి సేకరించిన రక్త నమూనాలతో భవిష్యత్తులో వారికి బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు ఏస్థాయిలో వస్తాయి.. వాటిని నియంత్రిచే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై పరిశోధనలు చేస్తున్నామన్నారు. కొవిడ్ సమయంలో ఎక్కువ శాతం జింకును వాడటం జరిగిందని దాని పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయన్న దానిపైనా పరిశోధనలు సాగిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్యూ శాస్త్రవేత్త మధుసూదన్, ఎంఆర్హెచ్ఆర్యూ శాస్త్రవేత్త ప్రసాద్, పీఆర్వో వీరకిరణ్ తదితరులు పాల్గొన్నారు.