'సింగం' బ‌దిలీ... స్థానికుల‌ క‌న్నీరు... గుర్రంపై వీడ్కోలు!

ABN , First Publish Date - 2020-07-09T12:07:58+05:30 IST

చంబ‌ల్‌లోయ‌ దొంగ‌ల భ‌ర‌తం ప‌ట్టిన ఎస్పీ బ‌దిలీ సంద‌ర్భంగా స్థానికులు అత‌నిని ఘ‌నంగా స‌న్మానించారు. ధౌల్పుర్ సింగంగా పేరొందిన ఎస్పీ మృదుల్ కచ్వాను కరౌలికి బదిలీ చేశారు. ఈ విష‌యం...

'సింగం' బ‌దిలీ... స్థానికుల‌ క‌న్నీరు... గుర్రంపై వీడ్కోలు!

ధౌల్పుర్‌: చంబ‌ల్‌లోయ‌ దొంగ‌ల భ‌ర‌తం ప‌ట్టిన ఎస్పీ బ‌దిలీ సంద‌ర్భంగా స్థానికులు అత‌నిని ఘ‌నంగా స‌న్మానించారు. ధౌల్పుర్ సింగంగా పేరొందిన ఎస్పీ మృదుల్ కచ్వాను కరౌలికి బదిలీ చేశారు. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే స్థానికులు ఎస్పీ బదిలీని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ విష‌యంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకున్న‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. దీంతో వారు త‌మ ప్రియ‌మైన ఎస్పీకి మేళ‌తాళాల మ‌ధ్య ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. రాజస్థాన్‌లోని ధౌల్పుర్ ఎస్పీ మృదుల్ కచ్వా... చంబల్ లోయలో స్థావ‌రం ఏర్ప‌రుచుకున్న‌ దొంగ‌ల‌ను త‌రిమికొట్ట‌డం ద్వారా మంచిపేరు తెచ్చుకున్నారు. స్థానికుల ఆద‌ర‌ణ కూడా దక్కించుకున్నారు. ఎస్పీ మృదుల్ కచ్వా బదిలీ గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్‌సింగ్‌ మలింగ మాట్లాడుతూ ఎస్పీ బదిలీని ఆపడానికి ప్రయత్నించామ‌ని, అయితే మంత్రి రమేష్ మీణా ఇందుకు అంగీక‌రించ‌లేద‌ని తెలిపారు. స్థానికంగా ఉన్న అనేక స‌మ‌స్య‌ల‌ను ఎస్పీ మృదుల్ స‌మ‌ర్ధవంతంగా ప‌రిష్క‌రించార‌న్నారు. కాగా ఎస్పీ మృదుల్ కచ్వా చంబల్ లోయలో పోలీసు బృందంతో నిరంతర నిఘా చేప‌ట్టి, లెక్క‌కు మించి దొంగ‌ల‌ను, దుండగులను జైలుకు పంపారు. ఎస్పీ వీడ్కోలు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న స్థానికులు క‌న్నీరు పెట్టుకున్నారు. అత‌నిని గుర్రంపైకి ఎక్కించి ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. 

Updated Date - 2020-07-09T12:07:58+05:30 IST