ముచ్చింతల్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్
ABN , First Publish Date - 2022-03-21T16:59:51+05:30 IST
హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు..
- వారాంతంలో RTC బస్సులు
- ఓ నెటిజన్ అభ్యర్థనతో ఎండీ సజ్జనార్ ఆదేశాలు
హైదరాబాద్ సిటీ : హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు వారాంతంలో బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు. వారాంతపు సెలవు రోజుల్లోనూ, సాధారణ సెలవు రోజుల్లోనూ సమతామూర్తి సందర్శనకు సిటీ నుంచి వెళ్లడానికి నేరుగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేవని నెటిజన్ ఒకరు ట్విటర్ ద్వారా ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లేందుకు అడిగితే క్యాబ్ వాళ్లు రూ.1000 వరకు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఈ ట్వీట్కు సానుకూలంగా స్పందించిన సజ్జనార్ ‘ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అలాగే సమతామూర్తిని దర్శించుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని, అందుకు అనుగుణంగా సమయాలను అప్ డేట్ చేయాలని సజ్జనార్ అధికారులను ఆదేశించారు.