కుళాయిల నుంచి బురద నీరు
ABN , First Publish Date - 2022-06-26T06:18:09+05:30 IST
జీవీఎంసీ సరఫరా చేస్తున్న కుళాయిల నుంచి వస్తున్న నీరు బురదమయంగా వుండడంతో తాగునీటి కోసం నాగేంద్రకాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇబ్బందులు పడుతున్న నాగేంద్రకాలనీ ప్రజలు
గోపాలపట్నం, జూన్ 25: జీవీఎంసీ సరఫరా చేస్తున్న కుళాయిల నుంచి వస్తున్న నీరు బురదమయంగా వుండడంతో తాగునీటి కోసం నాగేంద్రకాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 89వ వార్డు పరిధి కొత్తపాలెంలోని నాగేంద్రకాలనీ, పరిసర ప్రాంతాలకు జీవీఎంసీ కుళాయిల నుంచి గత కొద్దిరోజులుగా బురద నీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీలో దాదాపుగా ప్రజలంతా తాగునీటి కోసం జీవీఎంసీ వ్యక్తిగత కుళాయిలపైనే ఆధారపడతారు. అయితే కుళాయిల నుంచి బురద నీరు వస్తుండడంతో తాగడానికి ఇబ్బందిగా వుంటుందని వాపోతున్నారు. దీంతో చాలామంది సమీపంలోని ఆర్వో ప్లాంట్లో విక్రయించే తాగునీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. రోజుల తరబడి కుళాయిల నుంచి బురద నీరు వస్తున్నా జీవీఎంసీ అధికారులు, సిబ్బంది స్పందించకపోవడం దారుణమని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బురద నీరు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.