చెరువులు, కుంటలపై ముదిరాజ్లకే హక్కులు
ABN , First Publish Date - 2022-06-24T05:30:00+05:30 IST
చెరువులు, కుంటలపై ముదిరాజ్లకే హక్కులు
యాచారం, జూన్ 24: రాష్ట్రంలో చెరువులు, కుంటలపై ముదిరాజ్ సంఘాలకే అన్ని హక్కులు కల్పించాలని యాచారం మండల ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు నీలంశ్రీకాంత్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్ చేతులమీదుగా ముదిరాజ్ సంఘజెండాను ఆవిష్కరించి అనంతరం సంఘ కార్యాలయాన్ని ప్రారంభించారు. నీలంశ్రీకాంత్ మాట్లాడుతూ ఏటా చెరువులు, కుంటల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసి ఆదుకోవాలన్నారు. ముదిరాజ్లకు చెరువులు, కుంటల మెయింటెన్ అప్పగించాలని కోరారు. వృత్తిపరంగా ప్రమాదవశాత్తు మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో చేపల విక్రయ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల ముదిరాజ్సంఘ నాయకులు పాల్గొన్నారు.