శాసనమండలిలో ముదిరాజులేరి?

ABN , First Publish Date - 2021-11-10T06:05:27+05:30 IST

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అతిపెద్ద సామాజికవర్గం అయిన ముదిరాజ్ కులంలో అత్యధిక శాతం ప్రజలు పడుతున్న సమస్యలను వివరించాలంటే ‘రాస్తే రామాయణమంతా–చెబితే మహాభారతమంతా...

శాసనమండలిలో ముదిరాజులేరి?

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అతిపెద్ద సామాజికవర్గం అయిన ముదిరాజ్ కులంలో అత్యధిక శాతం ప్రజలు పడుతున్న సమస్యలను వివరించాలంటే ‘రాస్తే రామాయణమంతా–చెబితే మహాభారతమంతా’ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ సామాజిక వర్గం సమస్యలను ప్రస్తావించాలి అంటే చట్టసభలలో కనీసం ఒకరిద్దరు ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ మధ్యన హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచిన ఈటల రాజేందర్ మినహా ఇంకెవరూ లేరు. రాజ్యసభలో బండ ప్రకాష్ ముదిరాజు సామాజికవర్గం నుంచి ఎంపీగా సేవలందిస్తున్నారు. 50నుంచి 55 లక్షల జనాభా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ముదిరాజులపై ఈ వివక్ష కొనసాగుతుందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం శాసనమండలిలో స్థానిక సంస్థల నియోజక వర్గాల కోటాలో ఎన్నికైన 12మంది సభ్యుల పదవీకాలం 2022 జనవరి 4నాటికి ముగుస్తుంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న శాసనసభ్యుల కోటా 6స్థానాల కోసం, గవర్నర్ నియామకం ఒక స్థానం కోసం ఏడుగురు సభ్యులను ప్రస్తావించినట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం అందులోనూ ముదిరాజు సామాజికవర్గం లేకపోవడం విచారకరం. శాసనమండలి నాయకులను ఎన్నుకునే విషయంలో కనీసం ఒకరిద్దరికి ముదిరాజులకైనా అవకాశం ఇవ్వాలి. ఇప్పటికీ రాష్ట్రంలో ముదిరాజు కార్పొరేషన్ ఏర్పడకపోవడం తెలిసిన విషయమే. ఇప్పటికైనా ముదిరాజులు అంతా ఒక్కతాటిపైకి రావాలి.

డా. పోలం సైదులు ముదిరాజ్

రాష్ట్ర కోశాధికారి, ముదిరాజ్ సంక్షేమ సమితి

Updated Date - 2021-11-10T06:05:27+05:30 IST