స్వర్ణాభరణ శోభితం.. ఆదిదంపతుల సోయగం

ABN , First Publish Date - 2021-03-09T06:58:08+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో పార్వతీ పరమేశ్వరును అలంకరించేందుకు స్వర్ణాభరణాలను అధికారులు బ్యాంకు నుంచి తెచ్చారు.

స్వర్ణాభరణ శోభితం.. ఆదిదంపతుల సోయగం
ఉత్సవమూర్తులకు అలంకరించే ఆభరణాలు

శ్రీకాళహస్తి, మార్చి 8: శ్మశానాల్లో తిరిగే జంగమయ్య బూడిదతో దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే కలియుగంలో వెలసిన శ్రీకాళహస్తీశ్వరుడు సర్వాంగ సుందరంగా అలంకరించుకుని బ్రహ్మోత్సవాల్లో భక్తులకు కనువిందుచేస్తాడు. స్వర్ణాభరణ శోభితుడై మాడవీధుల్లో గంగాభవానీతో కలసి ఊరేగుతూ సోయగం ప్రదర్శిస్తాడు. బిల్వదళమాల, యజ్ఞోపవీతం, చామంతి పూలహారం, కర్ణపత్రాలు, కలికితురాయి, వజ్రాలు, జాతిరాళ్లు, రత్నాలు పొదిగిన పలురకాల ఆభరణాలు నిలువెల్లా ధరించి దర్శనమిస్తాడు. స్వామి ధరించే ఓ హారంలో నందివాహనంపై కొలువున్న ఆదిదంపతులను కుమారులు సుబ్రహ్మణ్యస్వామి, వినాయకస్వామి పూజిస్తూ కనిపిస్తారు. మరో హారంలో పార్వతీ పరమేశ్వరులు కొలువైన కైలాసగిరిని ఎత్తుకున్న రావణాసురుడు దర్శనమిస్తాడు. గౌరీశంకరుల రుద్రాక్షమాల, బంగారు తొడుగున్న జత రుద్రాక్షలు స్వామి అలంకరణలో ఇమిడిపోతాయి. ఇక అమ్మవారికి బంగారు మామిడి, పగడాలు, కెంపులతో తీర్చిదిద్దిన హారాలున్నాయి. బంగారు మొగిలిరేకుల జడ సౌందర్యం అనిర్వచనీయం. చెంపసరాలు, పాపిటిబిళ్ల, నత్తు, కాళ్లూచేతులకు దండ కడియాలు, జాతిరాళ్లు పొదిగిన వడ్డాణం, రావిఆకుల పతకం, సెనగపూల దండ.. అన్నీ స్వర్ణాభరణాలే. విభిన్న స్వర్ణాభరణాలు ధరించి ఆదిదంపతులు మాడవీధుల్లో ఊరేగుతుంటే ఆ సోయగం చూసిన పాహిమాం.. పరమేశా అంటూ.. భక్తులు పులకరించి పోతుంటారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన మహాశివరాత్రి, కల్యాణోత్సవం, నందిసేవ జరిగే రోజుల్లోనే వీటిని ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు. దీంతో బ్యాంకు లాకరులో ఉంచిన స్వర్ణాభరణాలను సోమవారం అధికారులు ఆలయానికి తీసుకు వచ్చారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే మళ్లీ వీటిని బ్యాంకుకు తరలిస్తారు. 

Updated Date - 2021-03-09T06:58:08+05:30 IST