Gurugram: ఆందోళనకరంగానే ములాయం ఆరోగ్య పరిస్థితి

ABN , First Publish Date - 2022-10-04T20:35:10+05:30 IST

అనారోగ్య కారణాల రీత్యా గత ఆదివారం గురుగావ్ ఆసుపత్రిలో చేరిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్..

Gurugram: ఆందోళనకరంగానే ములాయం ఆరోగ్య పరిస్థితి

గురుగావ్: అనారోగ్య కారణాల రీత్యా గత ఆదివారం గురుగావ్ ఆసుపత్రిలో చేరిన సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ (Mulayam Sing yadav) పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే (Critical) ఉందని, ప్రస్తుతం ఐసీయూలో వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని తాజా హెల్త్ బులిటెన్ తెలిపింది. అయితే, దీనికి ముందు ములాయం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చారని ఎస్‌పీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు  మంగళవారం ఉదయం తాజా బులెటెన్‌ విడుదల చేశాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని, ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని తెలిపింది.


కాగా, ములాయం సింగ్ శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని, హర్యానాలోని ఆసుపత్రిలో అంతర్జాతీయ వైద్య నిపుణుడు డాక్టర్ శుక్లా కటారియా పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతోందని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనను కలుసుకోవడం కష్టమని, ఆసుపత్రిలోకి ఎవరినీ  అనుమతించడం లేదని, ఎవరూ ఆసుపత్రికి రావద్దని కోరింది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం తాము అందిస్తామని ఒక ట్వీట్‌లో తెలిపింది. కాగా, ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, కోడలు డింపుల్ ఆదివారం మధ్యాహ్నం ఆసుపత్రిని సందర్శించారు. పలువురు రాజకీయ ప్రముఖలు కూడా ములాయం త్వరలో కోలుకోవాలని అభిలషించారు. ఎలాంటి సాయం అవసరమైనా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రధానమంత్రి మోదీ ఓ ట్వీట్‌లో తెలిపారు.

Updated Date - 2022-10-04T20:35:10+05:30 IST