అసాంక్రామిక వ్యాధులతో బహుపరాక్!
ABN , First Publish Date - 2021-11-28T09:46:57+05:30 IST
అసాంక్రామిక వ్యాధులు(ఎన్సీడీ) ప్రజారోగ్యానికి సవాల్గా నిలిచాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు.
- ఊపిరితిత్తులు, గొంతు కేన్సర్పై అవగాహన పెంచాలి
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
హైదరాబాద్ సిటీ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): అసాంక్రామిక వ్యాధులు(ఎన్సీడీ) ప్రజారోగ్యానికి సవాల్గా నిలిచాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే ఎన్సీడీకి కారణమని తెలిపారు. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘బ్రొంకస్-2021’ రెండో వార్షిక అంతర్జాతీయ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సదస్సును శనివారం హెచ్ఐసీసీలో వర్చువల్గా ఆయన ప్రారంభించారు. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు(సీఆర్డీ), క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజె్స(సీవోపీడీ)తీవ్రత పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్తో వచ్చే శ్వాసకోశ రుగ్మతల గురించి ప్రజల్లో అవగాహన పెరిగిందని, అలాగే పొగాకు ఉత్పత్తులతో వచ్చే ఊపిరితిత్తులు, గొంతు కేన్సర్పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. కొవిడ్ వైరస్ ప్రభావం ఊపిరితిత్తులపై తీవ్రంగా ఉంటుందని, దీని దృష్ట్యా శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను రెండేళ్లుగా చెబుతున్నామన్నారు. ఇలాంటి సదస్సులను ఏర్పాటు చేసిన యశోద హాస్పిటల్ యాజమాన్యాన్ని వెంకయ్య అభినందించారు. కొవిడ్ తీవ్రత సమయంలో వైద్యులు చేసిన కృషికి ఇది నివాళి అని యశోద హాస్పటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి అన్నారు. వివిధ దేశాల నుంచి వెయ్యి మందికిపైగా పల్మనాలజిస్టులు హాజరైనట్లు డాక్టర్ హరికిషన్ వివరించారు. ఈ సదస్సులో పల్మనరీ మెడిసిన్లో కొత్త ఆవిష్కరణలపై చర్చించారు.