ముంబై సూపర్ విక్టరీ.. కానీ
ABN , First Publish Date - 2021-10-09T05:03:06+05:30 IST
ఐపీఎల్ సెకండ్ షెడ్యూల్లో అసలైన క్రికెట్ మజా ఇప్పుడొచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై బ్యాట్స్మన్ చెలరేగి ఆడారు. ఓపెనర్ ఇషాన్ కిషన్(84: 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లు) విధ్వంసం..
అబుదాబి: ఐపీఎల్ సెకండ్ షెడ్యూల్లో అసలైన క్రికెట్ మజా ఇప్పుడొచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై బ్యాట్స్మన్ చెలరేగి ఆడారు. ఓపెనర్ ఇషాన్ కిషన్(84: 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లు) విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్(82: 40 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లు) రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరి భీరక ప్రదర్శనతో మైదానంలో పరుగుల వరద పారింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లకు ఏకంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హోల్డర్ ఒక్కడే 4 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ చెరో 2 వికెట్లు తీయగా, ఉమ్రన్ మాలిక్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్కు జేసన్ రాయ్(34: 21 బంతుల్లో 6 ఫోర్లు), అభిషేక్ శర్మ(33: 16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) మంచి ఓపెనింగ్ ఇచ్చారు. వన్డౌన్లో వచ్చిన మనీష్ పాండే(69 నాటౌట్: 41 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. కానీ మిగతా బ్యాట్స్మన్ కనీసం క్రీజులో నిలబడలేకపోయారు. ప్రియం గార్డ్(29) తప్ప మిగతా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.. 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 42 పరుగుల తేడాతో ముంబై విజయం దక్కించుకుంది. ముంబై బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, కౌల్టర్ నైల్, నీషమ్ తలా రెండు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, పీయూష్ చావ్లా, చెరో వికెట్ దక్కించుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్కు దక్కింది.
అయితే భారీ స్కోరు చేసి ఎస్ఆర్హెచ్ను ఓడించినా.. ముంబై ప్లే ఆఫ్ ఆశలు మాత్రం గల్లంతయ్యాయి. రన్ రేట్ విషయంలో కే్కేఆర్ కంటే వెనుకబడి ఉండడంతో టాప్ 4లో స్థానం సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుతం అన్ని జట్లూ గ్రూప్ దశ మ్యాచ్లు ముగించుకున్నాయి. ఆర్సీబీ చేతిలో ఓడినా ఢిల్లీ టాప్ ప్లేస్లోనే కొనసాగుతోంది. చెన్నై రెండో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక నాలుగో స్థానానికి కేకేఆర్ అర్హత సాధించింది.