సెలవులపై భారత్కు వచ్చిన NRI కి దిమ్మతిరిగే అనుభవం! ఫ్రెండ్ ఇచ్చాడంటూ ఆ నెంబర్కు కాల్ చేయడంతో..
ABN , First Publish Date - 2022-02-12T03:01:23+05:30 IST
సెలవులపై భారత్కు వచ్చిన ఎన్నారైకీ తాజాగా దిమ్మతిరిగే అనుభవం ఎదురైంది. మద్యం కోసం అతడు చేసిన ప్రయత్నాలు చివరకు ఊహించని పరిస్థితులకు దారి తీసాయి.
ఇంటర్నెట్ డెస్క్: సెలవులపై భారత్కు వచ్చిన ఎన్నారైకి తాజాగా దిమ్మతిరిగే అనుభవం ఎదురైంది. మద్యం కోసం అతడు చేసిన ప్రయత్నాలు చివరకు ఊహించని పరిస్థితులకు దారి తీసాయి. ముంబైకి చెందిన యువకుడు(27) అమెరికాలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే సెలవులపై భారత్కు వచ్చాడు. మలబార్ హిల్స్లో తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవల మద్యం తాగాలనుకున్న అతడు.. మద్యం డోర్ డెలివరీ చేసే షాపుల సమాచారం కావాలంటూ తన స్నేహితులు ఉండే వాట్సాప్ గ్రూప్లో కోరాడు.
గ్రూప్లో ఒకరు స్పందించి తాను గూగుల్ సెర్చ్ చేసి సంపాదించిన ఓ ఫోన్ నెంబర్ను షేర్ చేశారు. ఈ క్రమంలో ఆ ఎన్నారై.. మరో ఆలోచన లేకుండా ఆ నెంబర్కు కాల్ చేశాడు. వెంటనే లైన్లోకి వచ్చిన సైబర్ నేరగాళ్లు.. బాధితుడు కోరిన చోటుకి మద్యం పంపిస్తామంటూ నమ్మబలికారు. ఇందుకోసం ముందుగా ఆన్లైన్లో డబ్బు చెల్లించేందుకు బాధితుడిని ఒప్పించి.. అతడి నుంచి ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు వివరాలు తీసుకున్నారు. ఆ తరువాత..కార్డులోంచి ఏకంగా రూ.1.54 లక్షలు మాయమైపోవడంతో కంగారు పడిపోయిన బాధితుడు స్థానిక పోలీసులను సంప్రదించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ లావాదేవీని బ్లాక్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం.. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.