ముంబైలో మొదటిసారి చిరుతపులికి రేడియో కాలర్
ABN , First Publish Date - 2021-02-22T13:41:12+05:30 IST
ముంబై నగరంలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్కులో సావిత్రి అనే మూడేళ్ల వయసు గల చిరుతపులికి మొట్టమొదటిసారి...
ముంబై (మహారాష్ట్ర): ముంబై నగరంలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్కులో సావిత్రి అనే మూడేళ్ల వయసు గల చిరుతపులికి మొట్టమొదటిసారి రేడియో కాలర్ అమర్చి అడవిలోకి విడుదల చేశారు. బోరివాలిలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్కులో ఉన్న చిరుతపులికి సావిత్రి అనే పేరు పెట్టారు. ఈ చిరుతపులి కదలికలను తెలుసుకునేందుకు వీలుగా రేడియో కాలర్ చేశామని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ జి మల్లికార్జున చెప్పారు. ఆరే కాలనీ, ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల అడవుల్లో సంచరిస్తున్న ఈ చిరుతపులికి రేడియో కాలర్ అమర్చడం ద్వారా వీటిని ట్రాక్ చేయనున్నారు. కాలర్ లు ఉపగ్రహానికి సంకేతాలు పంపి, చిరుతపులి ఎక్కడ ఉంది? ఏం చేస్తుందనేది తెలుస్తోందని అటవీశాఖ అధికారులు చెప్పారు.
చిరుతపులుల కదలికలను తెలుసుకునేందుకు వీలుగా ఐదు చిరుతపులులకు రేడియోకాలర్ ఏర్పాటు చేస్తామని అటవీశాఖ అధికారులు చెప్పారు.గతంలో కెమెరా ట్రాప్ ల ద్వారా చిరుతపులుల కదలికలను తెలుసుకునేవారు. చిరుతల సంచారం గురించి తెలుసుకొని, అవి జనవాసాల్లోకి రాకుండా చేసేందుకు రేడియో కాలర్ లు ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు వివరించారు.