కస్టడీలో నీళ్లు కూడా ఇవ్వలేదన్న నవనీత్ రాణా దంపతులు.. టీ తాగుతున్న వీడియో విడుదల చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2022-04-26T21:51:52+05:30 IST

తమను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సరిగా చూసుకోలేదంటూ అమరావతి ఎంపీ నవనీత్ రాణా చేసిన ఆరోపణలపై

కస్టడీలో నీళ్లు కూడా ఇవ్వలేదన్న నవనీత్ రాణా దంపతులు.. టీ తాగుతున్న వీడియో విడుదల చేసిన పోలీసులు

ముంబై: తమను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సరిగా చూసుకోలేదంటూ అమరావతి ఎంపీ నవనీత్ రాణా చేసిన ఆరోపణలపై ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే స్పందించారు. నవనీత్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవిరాణా ఇద్దరూ ఖర్ పోలీస్ స్టేషన్‌లో టీ తాగుతున్న వీడియోను షేర్ చేశారు. దీనికి ఆయన ‘‘ఇంకేమైనా చెప్పాలా?’’ అని క్యాప్షన్ తగిలించారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారంటూ నమోదైన కేసులో నవనీత్ రాణా, రవిరాణాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


సోమవారం ఎంపీ నవనీత్ రాణా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాస్తూ.. తమను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు హింసించారని, కులం పేరుతో దూషించారని పేర్కొన్నారు. మంచి నీళ్లు కావాలని రాత్రంతా అడుగుతూనే ఉన్నా ఇవ్వలేదని ఆరోపించారు. తాను షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిని కావడంతో గ్లాసులో నీళ్లు ఇచ్చేందుకు నిరాకరించారని ఆరోపించారు.


జంతువులకన్నా హీనంగా తనను చూశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్, ముంబై పోలీసులు, సంబంధిత డీసీపీ, ఏసీపీ, ఇతర పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో నవీనీత్ కోరారు. ఈ లేఖపై స్పందించిన లోక్‌సభ సెక్రటేరియట్ ప్రివిలేజ్, ఎథిక్స్ బ్రాంచ్ దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. నవీనీత్ కౌర్ ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీస్ కమిషనర్ ఈ వీడియోను విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.



Updated Date - 2022-04-26T21:51:52+05:30 IST