ముమ్మరంగా మిర్చినాట్లు

ABN , First Publish Date - 2021-07-26T06:21:05+05:30 IST

ఇటీవల కురిసిన వర్షాలకు పొలాలు పదునెక్కడంతో రైతన్నలు ఖరీఫ్‌ పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు.

ముమ్మరంగా మిర్చినాట్లు
మిరప నాట్లు వేస్తున్న వ్యవసాయ కూలీలు


నిమగ్నమైన రైతులు

సాగు పెట్టుబడులు పెరిగాయని ఆందోళన

తర్లుపాడు, జూలై 25 : ఇటీవల కురిసిన వర్షాలకు పొలాలు పదునెక్కడంతో రైతన్నలు ఖరీఫ్‌ పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. పలు చోట్ల మిరప నాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. ఈ ఏడాది కంది, మిర్చి పంటల వైపు రైతులు దృష్టి సారించారు. ప్రస్తుతం నాయుడుపల్లి, తర్లుపాడు, గానుగపెంట, పోతలపాడు గ్రామాల్లో మిర్చి నాట్లు వేస్తున్నారు. తేజ రకం మొక్క రూ.2 వంతున కొనుగోలు చేసి రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎకరాకు 15 వేల మొక్కలను నాటుతున్నారు. ఎకరాకు ప్రస్తుతం రూ.40వేల వరకు ఖర్చు అవుతున్నట్లు రైతులు చెప్తున్నారు. గత ఏడాది మొక్క రూపాయ ఉంటే ఈ ఏడాది రెండు రూపాయలకు కొనుగోలు  చేసినట్లు తెలిపారు. మండలంలోని మెట్ట ప్రాంతంలో విస్తారంగా కంది పంటను సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. కంది విత్తనాల కోసం వినుకొండ తదితర ప్రాంతాలకు వెళ్లి విత్తనాలను కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. వ్యవసాయాధికారి కార్యాలయంలో ఇస్తున్న కంది విత్తనాలలో నాణ్యత లేకపోవడంతో రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి కంది విత్తనాలు కొనుగోలు చేసుకొంటున్నారు. మిగతా పొలాలను దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగుచేయనున్న కంది, సజ్జ, మిరప పంటలను సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

Updated Date - 2021-07-26T06:21:05+05:30 IST