వర్షాలతో ఆందోళనలో ముంపు గ్రామాలు
ABN , First Publish Date - 2020-11-27T05:58:23+05:30 IST
తుఫాన్ తీవ్రత వల్ల భారీ వర్షాలు కురుస్తుండడంతో గండికోట జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది.
19టీఎంసీలకు చేరువలో గండికోట నీటిమట్టం
కొండాపురం, నవంబరు 26: తుఫాన్ తీవ్రత వల్ల భారీ వర్షాలు కురుస్తుండడంతో గండికోట జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ముంపు గ్రామాల్లో భయాందోళన నెలకొలకొంది. ప్రస్తుతం 19 టీఎంసీలకు చేరువలో నీటిమట్టం ఉండడంతో ఇంకా పరిహారం అందని వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొండాపురంలో గ్రామంలో సుమారు 1100చెక్కులకు పరిహారం చెల్లించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు పెంచమని చెప్పిన ప్రభుత్వం మళ్లీ నీళ్లు పెంచుతుండడంతో నిర్వాసితుల్లో భయాందోళన నెలకొంది. వెంటనే నీళ్లు పెంచకుండా ఆపి పూర్తిగా పరిహారాన్ని చెల్లించి ఇళ్లు కట్టుకోవడానికి గడువు ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.
‘ ప్రజల ప్రాణాలకంటే నీళ్లే ముఖ్యమా’
జగన్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలకంటే గండికోట ప్రాజెక్టులో నీళ్లను నింపడమే ధ్యేయంగా పెట్టుకుందని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ మండిపడ్డారు. గురువారం ఆమె తమను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ స్వయంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు ఈనెల 3వ తేదీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి 18 టీఎంసీల కంటే గండికోటలో నీటిని పెంచమని పత్రికల్లో పతాక శీర్షికన వచ్చిందన్నారు. నెలరోజులు తిరగక ముందే గండికోటలో ప్రస్తుతం నీటిని 19టీఎంసీలకు పెంచారన్నారు. అదేవిధంగా రెండు నెలల కిందట తాళ్లప్రొద్దుటూరులో 16టీఎంసీలు నింపుతామని చెప్పిన ఎమ్మెల్యే మాటతప్పి ప్రజ లు ఏమనుకున్నా సరే అనే రీతిలో వారి ప్రాణాలను కూడా గాలికొదిలేసి నీటిని పెంచుతూనే ఉన్నారన్నారు. అందరికి పరిహారం చెల్లించకుండా పునరావాసం కింద ఇళ్లు కట్టుకోవడానికి కనీస గడువు ఇవ్వకుండా నీళ్లను పెంచుతూ మీ చావు మీరు చావండి అన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కొండాపురం రామచంద్రనగర్ ఇళ్ల సమీపంలోకి నీరు వచ్చినపుడు నీళ్లను పెంచకుండా ఆపేశారని ఆమె గుర్తుచేశారు.