‘మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

ABN , First Publish Date - 2020-12-04T05:08:54+05:30 IST

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు.

‘మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’
నందికొట్కూరులో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ కార్మికులు

నందికొట్కూరు, డిసెంబరు 3: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు.మున్సిపల్‌ కార్మికులు గురువారం మున్సిపల్‌ కార్యాలయం ముందు మోకాళ్లలపై నిల్చుని నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా నాయకుడు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల ఉపాధికి ఎసరు పెట్టే కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్లును ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్మికులను పర్మినెంట్‌ చేశాకే సచివాలయాలకు బదలయించాలన్నారు. కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. నాయ కులు పక్కీరయ్య, భాస్కర్‌, నాగేశ్వరరావు, మారెన్న, సుశాంతమ్మ, జయమ్మ పాల్గొన్నారు. 


నంద్యాల టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని సీఐటీయూ నాయకుడు మద్దులు డిమాండ్‌ చేశారు. నంద్యాల మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మద్దులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతన చట్టం అమలుచేసి రూ.24 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో పనిచేసే కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ నాయకుడు శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటిలో తోలగించిన 44 మంది కార్మికులను వెంటనే విధులలోకి తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు గౌస్‌, లక్ష్మణ్‌, వెంకట్‌, ప్రసాద్‌ మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.


కొత్తపల్లి: వేతనాలు చెల్లించాలని కొత్తపల్లి మండల పారిశుధ్య కార్మికులు కోరారు. గురువారం ఎంపీడీవో కార్యాలయం ముందు వారు ధర్నా చేశారు. పారిశుధ్య కార్మికులు మాట్లాడుతూ మండలం లోని 12 గ్రామ పంచాయతీలలో 42 మంది పనిచేస్తున్నారని, అయితే 16 నెలలుగా వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు.


ఆత్మకూరు: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న కార్మికులను క్రమబద్ధీ కరించాలని సీఐటీయూ నాయకులు రణధీర్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నాగన్న, తిమ్మయ్య, జోసఫ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఆత్మకూరు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వివిధ సంఘాల నాయకులు రామ్‌నాయక్‌, మెహన్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-04T05:08:54+05:30 IST