HYD : పబ్‌కు వెళ్లిన దంపతులు.. డ్యాన్స్ చేస్తుండగా ఆమెతో ఓ వ్యక్తి అసభ్య ప్రవర్తన.. చివరికి..!

ABN , First Publish Date - 2021-07-23T14:53:02+05:30 IST

పబ్‌లో డ్యాన్స్‌ చేస్తుండగా ఓ సైడ్‌ డ్యాన్సర్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ..

HYD : పబ్‌కు వెళ్లిన దంపతులు.. డ్యాన్స్ చేస్తుండగా ఆమెతో ఓ వ్యక్తి అసభ్య ప్రవర్తన.. చివరికి..!

  • పబ్‌లో హత్యాయత్నం.. ముగ్గురి అరెస్ట్‌
  • పరారీలో ప్రధాన నిందితుడు

హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : బేగంపేట కంట్రీ క్లబ్‌లోని హై ఫై పబ్‌లో యువతులతో పాటు వారికి సంబంధించిన వ్యక్తులపై జరిగిన దాడి, హత్యాయత్నం కేసులో పంజాగుట్ట పోలీసులు ముగ్గురిని గురువారం అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న నగరానికి చెందిన రేణుక, ఆమె భర్త శివ బేగంపేట కంట్రీ క్లబ్‌లోని హై ఫై పబ్‌కు వచ్చారు. పబ్‌లో డ్యాన్స్‌ చేస్తుండగా ఓ సైడ్‌ డ్యాన్సర్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో రేణుక, ఆమె సోదరి ఎస్‌.సోనీ పబ్‌కు వెళ్లి మేనేజర్‌ శేఖర్‌ను కలిశారు. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని గుర్తించడానికి సీసీ కెమెరా ఫుటేజీని అడిగారు. అతడు పబ్‌ యజమాని మురళీకృష్ణను కలవాలని సూచించాడు. వారు మురళీకృష్ణను కలిసి పరిస్థితిని వివరించారు.


పార్కింగ్‌ ప్రదేశంలో ఉండండి, వస్తాను అని మురళీకృష్ణ చెప్పాడు. వారు పార్కింగ్‌ ప్రదేశంలో వేచిచూస్తుండగా మురళీకృష్ణ, మరికొంతమంది వారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో సోనీ పంజాగుట్ట పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, దాడి కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు మురళీకృష్ణ పరారీలో ఉండగా, కంట్రీ క్లబ్‌ గేట్‌మన్‌, లాలాపేటకు చెందిన వి.నందీశ్వర్‌(24), సనత్‌నగర్‌ సుభా‌ష్‌నగర్‌కు చెందిన డీజే ఆపరేటర్‌ డి.శామ్యూల్‌(39), సికింద్రాబాద్‌ ఎల్‌ఐసీ కాలనీకి చెందిన ఎం.ప్రవీణ్‌ కుమార్‌(35)ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-07-23T14:53:02+05:30 IST