వివాహేతర సంబంధానికి అడ్డొచ్చినందుకే హత్య

ABN , First Publish Date - 2021-07-30T04:20:36+05:30 IST

కొండాపూర్‌ మండలంలోని మల్కాపూర్‌ శివారులో ఈ నెల 25న రాత్రి జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది.

వివాహేతర సంబంధానికి అడ్డొచ్చినందుకే హత్య
కొండాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ బాలాజీ

 ప్రియుడితో కలిసి భర్తనే కడతేర్చింది

 సంగారెడ్డి క్రైం, జూలై 29: కొండాపూర్‌ మండలంలోని మల్కాపూర్‌ శివారులో ఈ నెల 25న రాత్రి జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్యే హత్య చేయించినట్టు పోలీసుల విచారణలో తేలింది.  సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ గురువారం విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. మల్కాపూర్‌ గ్రామానికి చెందిన నాటుకారి రామలింగం(34) కలబ్‌గూర్‌ గ్రామానికి చెందిన అనితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది నుంచి రామలింగం కలబ్‌గూర్‌లో భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వరుసకు బావ అయిన భాస్కర్‌తో అనిత సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన రామలింగం పలుమార్లు భార్యతో గొడవ పడ్డాడు. ఈ విషయమై భాస్కర్‌ను కూడా హెచ్చరించాడు. దీంతో రామలింగంను చంపితే తామిద్దరూ సుఖంగా వారు ఉండొచ్చని అనిత, భాస్కర్‌ భావించారు. ఈ నెల 25న రాత్రి మద్యం సేవిద్దామని  రామలింగంతో నమ్మబలికిన భాస్కర్‌ తన ఆటోలో మల్కాపూర్‌ శివారులోని శేషాద్రి వెంచర్‌లోకి తీసుకెళ్లాడు.  బాగా మద్యం సేవించిన తర్వాత రామలింగం తలపై బండరాయితో బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పక్కనే ఉన్న పొదల్లో పడేసి భాస్కర్‌ పారిపోయాడు. ఈ కేసులో కొండాపూర్‌ సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐ బి.సంతో్‌షకుమార్‌  దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే రామలింగంను హత్య చేసినట్లు అంగీకరించారు. గురువారం నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.   

Updated Date - 2021-07-30T04:20:36+05:30 IST