Hyderabad: పెళ్లికి నిరాకరించిందని హత్య
ABN , First Publish Date - 2022-09-09T17:13:45+05:30 IST
ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఆమెను హత్య చేశాడో యువకుడు. రాజేంద్రనగర్ సర్కిల్ మధుబన్కాలనీకి చెందిన మేకల వెంకటేశ్ కుమార్తె
హైదరాబాద్/రాజేంద్రనగర్: ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఆమెను హత్య చేశాడో యువకుడు. రాజేంద్రనగర్ సర్కిల్ మధుబన్కాలనీకి చెందిన మేకల వెంకటేశ్ కుమార్తె ఎం.సాయిప్రియ(19)తో వనపర్తి జిల్లా ఖిలా ఘణపురం మండలం, మానాజీపేటకు చెందిన అంజన్న కుమారుడు శ్రీశైలం(23)కు మూడేళ్ల నుంచి పరిచయం ఉంది. అది ప్రేమగా మారింది. ఆమె విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారించారు. ఆ తర్వాత శ్రీశైలం స్వగ్రామం వెళ్లిపోయాడు.
ఈనెల 5న శ్రీశైలం సాయిప్రియకు ఫోన్ చేశాడు. మాట్లాడుకుందాం.. మా ఊరు రమ్మని చెప్పాడు. ఆమె అదేరోజు భూత్పూర్ వెళ్లింది. అతడు సాయిప్రియను తమ గ్రామం తీసుకెళ్లి మేనమామ కుమార్తె అని అందరికీ పరిచయం చేశాడు. మాట్లాడుకుందామని కెనాల్ సమీపంలో గుట్టల ప్రాంతానికి తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోమని శ్రీశైలం అడగగా.. ఆమె నిరాకరించింది. పాల వ్యాపారం చేసుకునే నిన్ను పెళ్లి చేసుకోవడం మా అమ్మ, నాన్న అంగీకరించరు. ఆ విషయం చెబుదామని వచ్చానంది. కోపోద్రిక్తుడైన అతడు ఆమెను చున్నీతో ఉరేసి చంపేశాడు. స్నేహితుడు శివ సహకారంతో కెనాల్ సమీపంలో మృతదేహాన్ని పాతిపెట్టాడు. సాయిప్రియ ఫోన్ను సమీపంలోగల బావిలో పడేశాడు. సాయిప్రియ కనిపించడం లేదని ఆమె తండ్రి మేకల వెంకటేశ్ మైలార్దేవ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీశైలం అనే యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాజేంద్రనగర్ డీఐ పవన్కుమార్, మైలార్దేవ్పల్లి ఎస్ఐ వి.రాజశేఖర్రెడ్డి గురువారం మానాసిపేట్ వెళ్లారు. అతడిని గణపురం స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. శ్రీశైలం, అతడికి సహకరించిన శివను అరెస్ట్ చేశారు.