బంట్వారంలో వ్యక్తి దారుణహత్య

ABN , First Publish Date - 2021-01-22T05:51:21+05:30 IST

బంట్వారంలో వ్యక్తి దారుణహత్య

బంట్వారంలో వ్యక్తి దారుణహత్య
హత్యకు గురైన ఎర్రవల్లి మల్లేషం

  • కత్తితో పొడిచి నడి రోడ్డుపై ఘాతుకం 
  • పాత కక్షలే హత్యకు కారణం


బంట్వారం: పాత కక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన బంట్వారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బంట్వారం మండల కేంద్రానికి చెందిన ఎర్రవల్లి మల్లేషం (45) గురువారం కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ తన ఇంటికి వెళ్లే సమయంలో ఉదయం 9 గంటలకు అదే గ్రామానికి చెందిన సందపురం రాజు వెనుక నుంచి వచ్చి కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రగాయాలైన మల్లేషాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్థులు పోలీసులకు, 108 వాహనానికి వెంటనే సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మల్లేషంను 108 వాహనంలో తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు 108 వాహన సిబ్బంది తెలిపారు. గతేడాది ఎర్రవల్లి మల్లేషం, సందాపురం రాజు తల్లితో పొలం వద్ద అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె కుటుంబసభ్యులకు తెలిపింది. గ్రామస్థులు నచ్చజెప్పి ఎర్రవల్లి మల్లేషంను, వారి కుటుంబసభ్యులను ఎక్కడికైనా వెళ్లి బతకండని సూచించారు. అప్పటి నుంచి వారు నవాబుపేట మండలం మాదారం గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మల్లేషానికి ఉన్న ఇల్లు అమ్మడానికి గురువారం ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి గ్రామానికి వచ్చాడు. దీనిని గమనించిన రాజు నిఘా పెట్టి మల్లేషంను కత్తితో పొడిచి దారుణంగా హత్యచేశాడు. మృతుడికి భార్య స్వరూప, కొడుకు, కూతురు ఉన్నారు. కాగా ధారూరు ఇన్‌చార్జి సీఐ రాజశేఖర్‌, బంట్వారం, కోట్‌పల్లి ఎస్‌ఐలు ప్రవీణ్‌రెడ్డి, వెంకటనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేస్తామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-01-22T05:51:21+05:30 IST