పైనాన్స్‌ కంపెనీ అసిస్టెంట్‌ మేనేజర్‌ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-10-27T04:33:47+05:30 IST

భద్రాచలం పట్టణంలోని ఓ ప్రముఖ టూవీలర్‌ పైనాన్స్‌ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.

పైనాన్స్‌ కంపెనీ అసిస్టెంట్‌ మేనేజర్‌ దారుణ హత్య
సంఘటన స్థలంలో మృతుడు రఘు

ప్రజాకోర్టులో శిక్షించిన్నట్లు మృతదేహం వద్ద లేఖ

ఏపీలోని ఎటపాక మండలం విస్సాపురం వద్ద ఘటన

భద్రాచలంటౌన్‌, అక్టోబరు 26: భద్రాచలం పట్టణంలోని ఓ ప్రముఖ టూవీలర్‌ పైనాన్స్‌ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా సరిహద్దు ఏపీలోని ఎటపాక మండలం విస్సాపురం, మాధవరావుపేట గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో జరిగింది. ఎటపాక సీఐ గజేంద్రకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విస్సాపురం మాధవరావుపేట గ్రామాల మధ్య రోడ్డు పక్కన మంగళవారం ఉదయం ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు సమాచారం అదించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన పరుచూరి రఘు(30)గా గుర్తుంచారు. మృతుడి ఒంటిపై పలు చోట్ల కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయి. మృతదేహంపై ఉన్న లేఖలో పైనాన్స్‌ పేరుతో రఘు గిరిజన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నందు వల్లనే ప్రజాకోర్టులో శిక్షించిన్నట్లు పేర్కొన్నారు. వేరేచోట హత్య చేసి మావోయిస్టుల పేరుతో లేఖ రాసి ఈ ప్రాంతంలో మృతదేహాన్ని పడేసిన్నట్లు అనుమానిస్తున్నట్లు సీఐ గజేంద్రకుమార్‌ తెలిపారు. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలా లేక వివాహేతర సంబంధం కారణమా అనే కోణంలో విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు సీఐ తెలిపారు. కాగా ఈ హత్యకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-10-27T04:33:47+05:30 IST