హుస్సేన్సాగర్ వద్ద ఆధునిక మ్యూజికల్ ఫౌంటెయిన్
ABN , First Publish Date - 2022-04-25T16:12:44+05:30 IST
హుస్సేన్సాగర్ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకులను..
- రూ.45.37 కోట్లతో పనులు
హైదరాబాద్ : హుస్సేన్సాగర్ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రూ.45.37 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో మల్టీమీడియా లేజర్ షోతో పాటు మ్యూజికల్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం లుంబినీపార్క్ పరిసరాల్లో పర్యాటక సంస్థ బోటింగ్ నిర్వహిస్తోంది. పక్కనే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సంజీవయ్య పార్క్ వద్ద అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో రూపొందించిన మ్యూజికల్ ఫౌంటెయిన్ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది.
కేంద్రం నిధులు కేటాయించింది. మొదటి దశలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.17.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే నిజాం కాలంలో నిర్మించిన ఉస్మానియా విశ్వ విద్యాలయం ఆర్ట్స్ కాలేజీ భవన సముదాయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రూ. 11.85 కోట్ల నిధులు మంజూరు చేసింది. వీటితో ఆర్ట్స్ కాలేజీ భవనాన్ని విద్యుత్ దీపాలతో, ముందు భాగంలో ఆకర్షణీయ మొక్కలతో శోభాయమానంగా తీర్చిదిద్దనున్నారు.