జగన్ గారూ.. న్యాయం చేయకుంటే చచ్చిపోతాం..!
ABN , First Publish Date - 2021-09-11T17:59:16+05:30 IST
కడప: జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతల దౌర్జన్యం కొనసాగుతోంది. అధికారం అండతో అరాచకాలు చేస్తున్న స్థానిక నేతలకు వైసీపీ ఎమ్మెల్యేలు వంత పాడుతున్నారు. సొంత పార్టీ కార్యకర్తలు కూడా వారి దౌర్జన్యాలకు బలవుతున్నారు.
శ్రుతిమించుతున్న.. వైసీపీ నేతల కబ్జా భాగోతం
తమకు ప్రాణ ఉందని ఓ ముస్లిం కుటుంబం ఆవేదన
కడప: జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతల దౌర్జన్యం కొనసాగుతోంది. అధికారం అండతో అరాచకాలు చేస్తున్న స్థానిక నేతలకు వైసీపీ ఎమ్మెల్యేలు వంత పాడుతున్నారు. సొంత పార్టీ కార్యకర్తలు కూడా వారి దౌర్జన్యాలకు బలవుతున్నారు. మైదుకూరులో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. దువ్వూరు మండలంలో ఓ మైనారిటీ కుటుంబం సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. ఎర్రబల్లికి చెందిన అక్బర్ బాషా కుటుంబానికి జగన్ అంటే అభిమానం. పాదయాత్రలో కూడా జగన్ను కలిశారు. అలాంటి వీరి కుటుంబానికి జగన్ పార్టీ నేతల నుంచే ముప్పు వచ్చింది.
బాషా భార్యకు వారి పుట్టింటి వారు.. ఎకరం యాభై సెంట్ల భూమి ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమిని వైసీపీ నేత ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాషా వాపోతున్నారు. తిరుపాల్ రెడ్డికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సీఐ కొండారెడ్డి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. సీఐ నుంచి తమకు ప్రాణహాని ఉందని సెల్ఫీ వీడియో ద్వారా తమ కష్టాన్ని చెప్పుకొన్నారు. తమకు న్యాయం చేయకపోతే అంతా ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన మరువక ముందే.. అక్బర్ బాషా కుటంబంపై వేధింపులు బయటపడడంతో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.