Prophet row : దేశవ్యాప్తంగా ముస్లింల ఆందోళనలు
ABN , First Publish Date - 2022-06-10T21:19:08+05:30 IST
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ముస్లింలు
న్యూఢిల్లీ : మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ముస్లింలు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఢిల్లీ, కోల్కతాలలో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బీజేపీ నుంచి సస్పెండయిన నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ముస్లింలు నిరసన ప్రదర్శన చేశారు. ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ మాట్లాడుతూ, నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని మసీదు పిలుపునివ్వలేదన్నారు. నిరసన తెలుపుతున్నవారు ఎవరో తమకు తెలియదని చెప్పారు. వారు బహుశా ఏఐఎంఐఎంకు లేదా ఒవైసీకి చెందినవారు అయి ఉండవచ్చునని తెలిపారు. ఆందోళన చేయాలనుకుంటే చేసుకోవచ్చునని, తాము మాత్రం మద్దతివ్వబోమని వారికి తాము చెప్పామని తెలిపారు.
కోల్కతాలో...
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో దాదాపు 300 మంది ముస్లింలు నమాజ్ అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నూపుర్ శర్మను అరెస్టు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. సెంట్రల్ డిస్ట్రిక్ట్ డీసీపీ శ్వేత చౌహాన్ మాట్లాడుతూ, జామా మసీదులో శుక్రవారం ప్రార్థనల్లో దాదాపు 1,500 మంది పాల్గొన్నారని తెలిపారు. వీరిలో సుమారు 300 మంది మసీదు బయట నిరసన ప్రదర్శన చేశారన్నారు. నూపుర్, జిందాల్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారని చెప్పారు.
పశ్చిమ బెంగాల్లోని హౌరాలో ముస్లింలు రోడ్డును దిగ్బంధనం చేసి, రాళ్ళు రువ్వారు. నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఉత్తర ప్రదేశ్లో...
ప్రయాగ్రాజ్, మొరాదాబాద్లలో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు నిరసన ప్రదర్శన చేశారు. మొరాదాబాద్లో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ప్రయాగ్రాజ్లో నిరసనకారులు రాళ్ళ దాడి చేశారు. అరాచకం సృష్టిస్తున్నవారిని వదిలిపెట్టవద్దని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రంలో 21 మందిని అరెస్టు చేసినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది.
జమ్మూ-కశ్మీరులో...
బట్లూం, షోపియాన్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
జార్ఖండ్లోని రాంచీలో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. రాళ్ళు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. కొందరు పోలీసులు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో దుకాణాలన్నిటినీ మూసివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.
నూపుర్ శర్మను బీజేపీ సస్పెండ్ చేయగా, నవీన్ జిందాల్ను పార్టీ నుంచి బహిష్కరించింది. నూపుర్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పారు.