విధుల్లో నిష్పక్షపాతంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-02-28T05:44:55+05:30 IST
ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కలెక్టర్ హరిజవహర్లాల్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే పీవోలు, ఏపీవోలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది ప్రవర్తనపైనే ఎన్నిక ప్రక్రియ ఆధారపడి ఉంటుందని చెప్పారు.
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి
కలెక్టర్ హరిజవహర్లాల్
కలెక్టరేట్, ఫిబ్రవరి 27 : ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కలెక్టర్ హరిజవహర్లాల్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే పీవోలు, ఏపీవోలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది ప్రవర్తనపైనే ఎన్నిక ప్రక్రియ ఆధారపడి ఉంటుందని చెప్పారు. సత్ప్రవర్తన, సమయపాలన చాలా ముఖ్యమన్నారు. పీవోలు తోటి సిబ్బందిని కలుపుకొని సమన్వయంతో పని చేయాలని చెప్పారు. నిర్ణీత సమయానికి ఖఛ్చితంగా పోలింగ్ ప్రారంభించాలని, ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ -19 రెండో దశ మొదలయ్యిందని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బందికి ఫేస్ షీల్డులు, మాస్కులు, శానిటైజర్లు సరఫరా చేస్తామన్నారు. పోలింగ్ ఏజెంట్లకు కూడా ఈ సారి మాస్కులు సరఫరా చేస్తామని చెప్పారు. పీవోలు, ఏపీవోలకు ఎన్నికల నోడల్ అధికారి ఎస్.అప్పలనాయుడు పవర్ పాయింట్ ప్రజెంట్షన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జేసీ వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ వర్మ, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.