తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2021-05-10T05:37:30+05:30 IST
వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలని సీపీఎం ఖేడ్ ఏరియాకమిటీ కన్వీనర్ చిరంజీవి డిమాండ్ చేశారు.
సీపీఎం కన్వీనర్ చిరంజీవి డిమాండ్
నారాయణఖేడ్, మే 9: వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలని సీపీఎం ఖేడ్ ఏరియాకమిటీ కన్వీనర్ చిరంజీవి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఖేడ్ మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పార్టీ నాయకులతో సందర్శించి కొనుగోళు తీరును పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా నారాయణఖేడ్ ప్రాంతంలోని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మాత్రం కొనుగోలు చేయడం లేదన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా కొందరు నిర్వాహకులు తరుగు పేరిట రెండు కిలోల ధాన్యం అధికంగా తూకం వేస్తున్నారన్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యం కొనుగోళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.